Saturday, September 18, 2010

ఆర్.వసుంధరాదేవి

ఆర్.వసుంధరాదేవి
స్వానుభవ సంపదా,అన్వేషణా తృష్ణా,అధ్యయన తత్పరతల నించీ వెలువడిన తాత్విక చింతనా పరిమళాలు,ఆమె కధలు... పాఠకుల మనసులకు సాంత్వన నిచ్చే మంచిగంధపు లేపనాలు. మనసు పోకడలు,కడలి తరగలలా, ఒకానొక ఆవేశంతో ఎగసిపడి ఎగసిపడి.ఆవేశపడి.ఆయాసపడి.అంతలోనే తమ ఆత్మను కనుక్కుని,శమించి ప్రశాంతపడి ,శాంతపడి”ఓ! అంతా చేసి ఇందుకేనా? అని నిర్మలంగా నవ్వుకోగలిగే స్థితిలోకి తీసుకుపోతాయి. తన అనుభవంలోనుంచీ రూపొందించుకున్న తాత్వికతను పాఠకులకు పంచడం ఎంత తార్కికంగా కళాత్మకంగా ఉంటుందో తెలియాలంటే ఆమె 1960 లలోనే వ్రాసిన “చెరువుదగ్గర” తో మొదలు పెట్టి “జాన్ పాల్ చేసిన బీరువా” “పెంజీకటికావల”, “బ్రిడ్జి కింద” ,”నీడలు” “అమల,”“అమ్మా ఇక సెలవు” వంటి కధలు చదివి ఆమె తాత్విక ధృక్పధాన్ని,సామాజిక విశ్లేషణనూ ,మనస్తత్వశాస్త్ర పరిజ్ఞానాన్నీ,తెలుసుకుని ఆమె మనకు వాగ్దానం చేసే జీవనోత్సాహాన్ని అందుకోవాలి ...ఆమె రాటకొండ వసుంధరాదేవి. ఈమె వివిధ సంకలనాలలో వ్రాసిన యాభై కధలనూ గుదిగుచ్చి 2004లో ఒకే సంకలనంగా వెలువరించిన తరువాత అన్నికధలూ ఇప్పటిపాఠకులకు అందుబాటులో కొచ్చాయి .ఇందులోనుంచీ పై చెప్పిన కధలు ఆమె శిల్ప నైపుణ్యానికీ సామాజిక తాత్విక ధృక్పధానికీ అద్దంపడతాయి.

ముందు చెరుదగ్గిరికి పోదాం.దాన్ని బుక్కరాయసముద్రం చెరువని అక్కడి వాళ్ళు అన్నప్పటికీ ,దేశమంతా అనంతపురం చెరువనే అంటారని కురువలింగప్ప అంటాడు.అనంతాకాశం కింద ఆ చెరువు దగ్గర కట్టిన గణేశుడి గుడీ,అక్కడీ హద్దులు లేని స్వేఛ్ఛ సుశీలమ్మకి చాలా ఇష్టం...సుశీలమ్మ సంప్రదాయ కుటుంబం చెక్కిన బొమ్మ.ఆ ఇంటి ఆడపిల్లలెలా వుండి మంచి అనిపించుకోవాలో తెలుసుకుంటూ తనని అలా మలచుకుంటూ పెరిగి ,వివాహమై ,భర్తతోడిదే జీవనం అనీ భార్యా భర్తలబంధం ఆత్మపరమాత్మల బంధం అనీ నమ్మిభర్త కి జలుబుచేసినా భయపడుతూ బతుక్కొస్తున్న ముఫై అయిదేళ్ళ స్త్రీ.అయితే ఆమెలో ఈ మధ్య ఒక అలజడి ప్రారంభమైంది .”.తన జీవితం తనది కానట్లూ,ఎవరి బలవంతం మీదో బ్రతుకుతున్నట్లు బాధ. జీవిత కాలంలో చాలా భాగం గడిచిపోయింది.ఇహ చచ్చిపోవడం తరువాయి.బతక్కుండానే చావు...నిజం జీవితాన్ని అనుభవించాలని ,నవ్వాలని ఏడ్వాలని,అందులో లీనమై పోవాలని ఆరాటపడుతూ దాన్ని అందుకోలేక విడిగా నిలిచిపోయి వ్యర్ధంగా నశించిపోతున్నట్లు భావన.కల్గుతుంది...తానేదో బలాత్కారానికి గురౌతున్నట్లు,ఎవరో తనని మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. గడచిన జీవితం ఎడారిలాగా ముందున్నది స్మశానం లాగా తోస్తున్నది” అంతే కాదు”వేల సంవత్సరాలనించీ వెలుగులు చిమ్ముతూ వస్తున్న భారతీయ జీవన విధానం నేడు ఉత్త మేడి పండు అయిందా!!అందులో లోపం ఏర్పడిందా?కడుపులో పుచ్చును దాచుకున్న మల్లెమొగ్గ ఈ మనసు అనిపిస్తున్నది.ఇరుకులో చిక్కుకున్నట్టి భావన బలపడుతున్నది. ఈ ముసుగులో నించీ వ్యవహరించడానికే గాని జీవించడానికి హక్కులేదేల?ఏ పనీ సద్య స్ఫూర్తి తో చెయ్యలేను” ఇదంతా కూడా జండర్ చట్రంలో ఇరుక్కుపోయిన సుశీలమ్మ వేదన.ఇటువంటి ఎడారి లోకి కురువలింగప్ప ఒక నౌకరుగా ప్రవేశించాడు.ఎనభై ఏళ్ళ పల్లెటూరి “అనాగరికుడు”.వృధాప్యం అతని శరీరానికే గానీ జీవితానికి కాదు.ఆ చుట్టుపట్ల అన్ని ప్రదేశాలగురించి అనర్గళంగా మాట్లాడతాడు.మనుషుల గురించి ,ప్రకృతి గురించి జంతువుల గురించి ,అక్కడి వేయిన్నొక్క దేవుళ్లగురించి ,జీవితం గురించి ..అట్లా పరవళ్లు తొక్కే ఉత్సాహంతో మాట్లాడతాడు.గలగల మని నవ్వుతాడు.ఆ వయస్సులో తనకు అక్కరకు రాని కొడుకు గురించికూడా కోపంతెచ్చుకోడు.పిల్లలేదో చేస్తారని ఆశించి వాళ్ళని పెంచం కదా?పెంచడమనే ధర్మంప్రకారం పెంచుతాం అని నిర్వికారంగా జీవన సత్యాలను చెప్తాడుఎవరో తయారు చేసి పెట్టిన విధంగాకాక తనకి తోచినవిధంగా ప్రవర్తించే స్వేఛ్చ కలవాడు. .తనూ తన జీవితం వేరైనట్లు లింగప్పా అతని జీవితం వేరుకావని అనుకుంటుంది సుశీలమ్మ.సుఖం దుఃఖం,జబ్బు చావు అన్నీ జీవితంలో భాగాలే లింగప్పకి..దేనికీ కలతపడడు..అతనిది అతిసామాన్య జీవితం.. అధమాధపు జీవితం.. కానీ అది చావు తాకని జీవితం .నిరంతరం ప్రవహించే జీవన వాహిని...ఒక సజీవ చైతన్యమూర్తి,ఈ కురువలింగప్ప.అతని మాటలు. చేష్టలు .అనుభవాలు, జీవితాన్ని జీవించడానికే గానీ,కృత్రిమపు నీతి చట్రాలలో బిగించుకోడానికి కాదనే అతనిధృక్పధం,సుశీలమ్మకు ఒక చల్లని కాలక్షేపం.ఏ చెరువుదగ్గర,గణేశుని ఆలయం దగ్గర ఆమె స్వేఛ్ఛనూ శాంతినీ పొందగలిగేదో అక్కడే జరిగిన ఒక దుర్ఘటన ఆమె జీవితంలో భూకంపం అయి ప్రాణాలు తీసింది..ఆ చెరువుదగ్గరే ,ఆమె భర్త సమక్షంలోనే ఆమె పై అత్యాచారం జరిగింది.శరీరంపై అసహ్యం పుట్టి బావిలో దూకి చనిపోవాలనుకుంది.కానీ తీసి రక్షించారు.ఆస్పత్రిలో చేర్చారు.ఆమెను చూడవచ్చిన అత్తవారి నోటినించిగానీ పుట్టింటి వారి నోటి నుంచిగానీ ఆమెను బ్రతికించేమాటేదీ రాలేదు.ఆమెను ఏకాంతంలో “సీతా”అని ప్రేమగా పిలుచుకునే భర్తముఖంలో ఆమెను బ్రతికించే భావమేదీ కనపడలేదు.తనే తప్పూ చెయ్యలేదని ఆమెకు తెలుసు.తనకు చచ్చిపోడానికి ఎండ్రిన్ తెచ్చిపెట్టమని లింగప్పనడిగింది..భగవంతుడిచ్చిన జీవితం జీవించడానికే గానీ అంతంచేసుకోడానికి కాదనీ ఇక్కడ ఉండలేకపోతే ఇంకొక చోట ఉండే ఏర్పాటు చేస్తాననీ అనునయిస్తాడు లింగప్ప.లింగప్పని తప్పించుకుని చెరువుదగ్గరకి వచ్చింది సుశీలమ్మ.అక్కడ అనంతమైన స్వేఛ్ఛ!!,తను నమ్మి తనను అర్పించుకున్న నాగరిక సమాజం, తను తప్పు చెయ్యలేదనే నిజాన్ని ఒప్పుకుని తనని అక్కున చేర్చుకోలేక,ఒక అనాగరిక లింగప్ప ఎదుట మరిగుజ్జై పోయింది..తనకి మలినం అంటలేదని భగవంతుడికి తెలుసు.ఆయనకి కరుణ తప్ప ఇంకేమీ లేదు.అనుకుంటే ఒక సత్య దర్శనం అయినట్లయింది.అట్లా చెరువు గట్టున నడిచి నడిచి కాలికి రాయితగిలి దొర్లిపడి మట్టిలో కలిసిపోయింది. 1960 లోనే జండర్ నియంత్రణని స్త్రీలు ఎంత ఆత్మహత్యా సదృశ్యంగా భావించేవారో పదునుగా చెప్పిన కధ ఇది. బాహ్య ప్రవర్తనలో నాగరిక సమాజానికి కాంట్రాస్టుగా కనిపించే లింగప్ప భగవంతునిలా ప్రాణదాతే కానీ నాగరిక సమాజంలా ప్రాణహరుడు కాదు. వసుంధరాదేవి సృష్టించిన గొప్ప పాత్ర కురువ లింగప్ప..

ఇంచుమించు ఇటువంటిదే జాన్ పాల్ పాత్రకూడా. ఇతను టక్కరి వాడు.భార్యను హింస పెట్టగా ఆమె అతన్ని విడిచిపెట్టి కూతురుతో వుంటోంది .అతని కొడుకు ఫిలిప్.కొడుకంటే కడు ఆపేక్ష అతనికి.అందువల్ల అతను సరిగ్గా కుదురుకోకపోయినా ఏమీ అనడు.పైగా కొడుక్కి ఆత్మాభిమానం ఎక్కువని గర్వంగా చెబుతాడు. ఈ కధ ఉత్తమ పురుషలో నడుస్తుంది. కధకురాలు ఎంతో అభిమానంగా దాచుకున్న పాట మీద ఆమె కొడుకు కొత్త పాట రికార్డు చేస్తాడు.తనకెంతో ఇష్టమైన పాట లేకుండా పోయినందుకు బాధపడి తనకంటూ ప్రత్యేకంగా ఒక బీరువా వుంటే తనకిష్టమైనవన్నీ దాచుకోవచ్చని ఆమె జాన్ పాల్ ని పిలిచి బీరువా చెయ్యమని పురమాయిస్తుంది.అతను దొంగ బిల్లులు వేయించి కలప కొంటాడని, చెక్కలు ఎత్తుకు పోతాడనీ వేళకి పని పూర్తి చెయ్యడనీ మధ్యలో మరోపని ఒప్పుకుంటాడనీ అతన్ని గురించి చాలా మంది చెబుతారు.అయినప్పటికీ అతను నైపుణ్యం కల పనివాడు కాబట్టి అతను పెట్టే తిప్పలన్నీ పడి మొదట చెప్పిన అంచనా కు చాలా ఎక్కువ ఖర్చైనా బీరువా చేయించుకుంటుంది .ఇంక చివరి పాలిష్ లు కొసముగింపులు వుండగా జాన్ పాల్ కొడుకు ఫిలిప్ వాగులో పడి చనిపోతాడు.అంత ప్రేమించిన కొడుకు మరణం అతన్ని ఎంత కుంగదీస్తుందో ననుకుంటుంది ఆమె...కానీ ఇప్పుడు అతనిలో అది వరకటి టక్కరి తనానికి అతివినయానికి బదులు ఒక హుందాతనం వచ్చింది. “..మాట పొరపాటు రాకూడదు నాయనా!!అయ్యగారు డబ్బులెక్కువని కోప్పడితే నువ్వు కూలి తీసుకోమాక” అని అతని కొడుకు చెప్పిన మాటకి కట్టుపడి తన పాత జీవన ధోరణిని మార్చుకున్నాడు. కొడుకు పోయిన నాలుగోరోజునే పనికి వచ్చాడు.బీరువా పని పూర్తి చేశాడు.మనిషిని ధరించిన మనస్సు అనంతమూ మహాశక్తివంతమూ అని కధకురాలు అర్ధంచేసుకుంటుంది..జాన్ పాల్ ధైర్యశాలి,బలశాలి.ధైర్యమూ బలమూ మనిషిలోని సత్యానికి సంబంధించిన గుణాలు..బీరువాను చూసిన పిల్లలు తామెవరు ఏ అరల్లో ఏం పెట్టుకోవాలో అని మాట్లాడుకున్నఫ్ఫడు ఆమె అది తనకోసం చేయించుకున్నానని అనదు జాన్ పాల్ కొడుక్కిచ్చిన మాటకోసం తనపాత జీవితాన్ని ఎంత అలవోకగా విడిచిపెట్టాడో తన తన వస్తువులు తనకే వుండాలన్న కోరికని వదులుకుని..తను దాన్ని ఉపయోగించుకున్నా లేకపోయినా ఫరవాలేదనుకుని పిల్లలకివ్వడానికి సిధ్ధపడుతుంది. :”ఈ ప్రపంచం ఒక అస్పష్టమైన వర్ణ చిత్రం.అందులో మనం గుర్తించగలిగేది అంతకు ముందే (మన) మనసులో ఎరుకగా వున్న దానిని మాత్రమే..అనికూడా అంటుంది రచయిత్రి...

నీతి,వినయం ఇతరుల బాగుకోసం తాము అన్నీ వదులుకోడం ,తమ బ్రతుకిక ఇంతే అనుకుంటూ అణిగి మణిగి వుండటం మొదలైన గుణాలన్నీ బొద్దింక గుణాలనీ ,జీవించడం అంటే ఒక ఉత్సాహంతో ధైర్యంతో జీవించడం అనీ టక్కరితనం అబధ్ధాలాడటం వంటి కొన్ని సర్వైవల్ టెక్నిక్న్స్ అవలబించినా అది జీవనోత్సాహానికి నిదర్శనమే కానీ మరొకటికాదనీ రచయిత్రి “మనుషులూ బొద్దంకులూ” “అ-బధ్ధం’ బ్రతుకు తెరువు” వంటికధల్లో చెబుతారు.
“పెంజీకటి కవ్వల”.కధలో ప్రధాన పాత్ర జయలక్ష్మి,ఆమె మానసికావస్థలు ,భయాలు,అనిశ్చితమైన ,ఆలోచనలు,ఆమె మానసిక పరిణామం ,పరిణతీ పొరలు పొరలు గా చిత్రించడం వసుంధరాదేవి ప్రత్యేకతే!! ప్రాణులందరికీ మరణం తధ్యమే.అయితే మనుషులకు ఆ ఎరుకను నిబ్బరంగా అంగీకరించడం అంత సులువుకాదు.సంపన్నుల కాలనీలో కావాలని ఇల్లుకట్టుకున్న జయలక్ష్మికి ఆ కాలనీ వెనక వుండి శవంకాలినప్పుడల్లా ఇళ్ళల్లోకి చావుకమురువాసన పంపే స్మశానం అంటే భయం ఏవగింపు.తనకి మరణం ఎప్పుడొస్తుందోనని భయం..ప్రతి సంఘటననూ చావుతో ముడిపెట్టి చూసుకుంటూ,”స్వామీ నన్ను బ్రతకనీ” అని దేవుడి గదిలో తలుపు వేసుకుని ప్రార్ధిస్తుంది. ఆమెకు గుండె జబ్బు వస్తుంది..అట్లా సంక్షుభితమైన మానసిక స్థితిలో వున్న జయలక్ష్మికి ఒక అనుభవం ఎదురైంది.ఈ ఆత్మికమైన అనుభవం తో ఆమెకు సత్య దర్శనం అయినట్లు అయింది.తను లేకపోయినా ఈ ప్రపంచం వుంటుంది.ఇక్కడి సౌందర్యం సంతోషం వుంటాయి. అనే ఆనందం కలిగింది,జయలక్ష్మి మానసికావస్థలను ఈ కధలో రచయిత్రి చిత్రించిన తీరు అధ్భుతం. అట్లాగే “నీడలు” అనే కధలో నిర్మల పాత్ర .,మనం చూసే చూపు బట్టే మనకు ప్రపంచం అర్ధం అవుతుందని,మనసులో వుండే నీడల్ని (అభద్రతాభావాలు,అహేతుక ద్వేషాలు ) తొలిగించుకుంటేగాని ప్రపంచాన్ని సరైన దృష్టితో చూడలేమనీ ఈ కధ చెప్తుంది.

“బ్రిడ్జికింద” కధ సమాజంలో వేళ్ళుపాతుకుపోయిన అవినీతి ,నిజాయితీ పరులకు బ్రతుకు దుర్భరం చెయ్యడాన్ని ముగ్గురు వ్యక్తుల జీవన నేపధ్యంలో ,చిత్రిస్తూ ,అటువంటి జీవితాన్ని వాళ్లు ఎదురుకున్న పధ్ధతుల్నీ దగాపడ్ద వాళ్ళ పక్షాన నిలబడవలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.చలపతి తండ్రి కాలేజి లో స్వీపర్ గా పని చేసి అణగి మణిగి ఉంటూ పావలా అర్ధా మామూళ్ళూ టిప్పులూ వసూలు చేసుకుంటూ పార్టీల్లో మిగిలిపోయిన స్వీట్లూ ఫలహారాలూ ఇంటికి తెస్తూ తినీ తినకా జీవనం గడుపుకొస్తున్నాడు .ఆ పరిస్థితుల్లో స్కూల్ చదువు ముగించిన చలపతిని కూడా తండ్రి స్వీపర్ ఉద్యోగంలో ప్రవేశపెట్టగా ,అక్కడ తండ్రి హైన్యాన్ని చూసి ఆ ఉద్యోగమూ ఇల్లూ వదిలి రిక్షా తొక్కుతున్నాడు చలపతి. తండ్రి అప్పుచేసి తీర్చలేక ఆత్మ హత్య చేసుకుంటే రిక్షా తొక్కి ఆ అప్పు తీర్చి మళ్ళీ వ్యవసాయంలో నిలదొక్కు కుందామని పట్నం వచ్చాడు పోతప్ప.అతను నిజాయితీగానే వున్నాడు .అతనీ భార్య కూడా బ్రిడ్జి దగ్గర తమల పాకులమ్మి ఒకటీ అరా సంపాదిస్తున్నది.నీతి,నిజాయితీలమీద చలపతికీ పోతప్పకీ వాదమవుతుంది..పోతప్ప చెల్లెలు కూడా బ్రతకడానికి పట్నం వచ్చింది.బ్రిడ్జి కింద బజ్జీల దుకాణం పెట్టింది..ఆమె భర్త తాగుబోతు సోమరి.పోతప్ప రెండు పొటేలు పిల్లల్ని కొని మైదానంలో కట్టేస్తే ఒక దాన్ని రహస్యంగా అమ్మేసి తాగేశాడు.కోపంపట్టలేని పోతప్ప అతన్ని కొడుతుంటే పోలిసులు పట్టుకెళ్ళి లంచంఇస్తేగానీ వదలక పోతే అందుకోసం రెండో పొటేలుని అమ్మాల్సి వచ్చింది.ఆ కోపంతో నిస్సహాయతతో బాగా తాగేసిన పోతప్ప ఆర్ టీ వో గారి కారు షేడ్దు పీకి పడేసి భీభత్సం సృష్టిస్తాడు.మళ్ళీ పోలీసులు పట్టుకెళ్లడానికి వస్తే బ్రిడ్జికింద వాళ్ళ అతన్ని దాచేస్తారు. డబ్బుతో పాతు ఆత్మ విశ్వాసం కూడా పోయింది పోతప్పకి.అప్పుడతను చలపతి ఉంటే బావుండుననుకుంటాడు.చలపతి అప్పటికే కొన్ని అప్పులు తీర్చకుండానే వూరు వదిలి వెళ్ళిపోయివున్నాడు. సమాజం నిర్దేశించిన న్యాయాన్యాయాలకంటె మనుగడ ముఖ్యం అనేది చలపతి ఎంచుకున్న మధ్యే మార్గం .పాత ఊరినీ కొత్త ఊరినీ కలిపే ఆ రైలు బ్రిడ్జి కింద కానాలు ఎంతమందికో తాత్కాలిక నివాసాలు.”ఒక గుడ్ద పీలికల మూటా ఒక సంచీ రెండు కుండలూ, ఒక లోటా,నీళ్ళు ముంచుకున డబ్బా తెచ్చుకుంటారు.వాళ్ళు ఎంత ఆకస్మాతుగా వచ్చారో అంత ఆకస్మాత్తుగా నామరూపాలు లేకుండా మాయమై పోతారు. ఎందుకు వచ్చారో ఎలా బ్రతికారో ఎందుకు వెళ్ళిపోయారో ఎవరికీ తెలియదు.” అది బ్రిడ్జి కింద దయనీయ చిత్రం.భౌతిక పరిస్థులకు లొంగి ప్రవర్తించే ఏ పాత్ర పట్ల కూడా రచయిత్రికి విముఖతలేదు సానుభూతి తప్ప.వసుంధరాదేవి మరొక అధ్భుతమైన కధ “అమ్మా ఇక సెలవు”.ఈ కధలోని అమ్మ ఒక్క కధకురాలి అమ్మే కాదు ఆమె విశ్వమాత. ఈ కధలో రెండు అంశాలున్నాయి.ఒకటి ఆడపిల్ల జీవితాన్నంతా పెనవేసుకుపోయిన అమ్మ జీవితం రెండు వ్యాపారసంబంధమే కానీ మానవ సంబంధాన్ని హృదయ సంబంధాన్ని కోల్ఫోయిన కార్పొరేట్ వైద్యపు నిర్లక్ష్యపూరితమైన యాంత్రికత.జీవన్మరణ స్థితిలోని వ్యక్తికి రవంత ఊరట సాంత్వన ఇవ్వక మృత్యువుకూ వేదనకు మరింత చేరువ చేసే యాత్రికత....ఈ కధలో రచయిత్రి అమ్మగురించి వ్రాసిన ప్రతి వాక్యమూ ప్రతి ఆడపిల్ల మనసులో నిలిచిన సత్యం.వసుంధరాదేవి కధలలో పాఠకులమనసులో నిలిచివుండే కధల్లో ఒకటైన ఈ కధ గురించి రెండు వాక్యాల్లో రాయలేము.అట్లాగే చిట్టిరాజు,సీతాకోక చిలుక ,ఇంతేలే పేదల ఆశలు అడవిపువ్వు వాటికవి విశిష్టమైన కధలు.జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా నిరాశానిస్పృహలావరించినా మళ్ళి లేచి నిలబడి జీవితం కొనసాగించే రాగమ్మ, గౌరి, నాగరిత తెచ్చిన వేగానికి తట్టుకోలేక మరణించిన అమల ఇలా ఆయా పాత్రల మానసిక పరిణామాలను తనదైన శైలిలో నిబ్బరంగా చెప్తారు రచయిత్రి..

1931 లో జన్మించిన వసుంధరాదేవి బాల్యంలోనే వేటపాలెంలోని ప్రసిధ్ధ గ్రంధాలయంతో అనుబంధం ఏర్పరుచుకుంటూ తెలుగు భాషపై మక్కువ పెంచుకున్నారు.అటుపై గుంటూరులో సెంట్ జోసెఫ్స్ కాన్వెంట్ లోనూ అక్కడి విమెన్స్ కాలేజీలోనూ చదివి ఆంధ్రా యూనివర్సిటీ నించీ కెమిస్ట్రీ లో మాస్టర్స్ చేసారు. తరువాత ప్రఖ్యాత విమర్శకులు ఆర్,ఎస్.సుదర్శనం గారిని వివాహం చేసుకుని గృహిణిగా వుంటూనే తన అధ్యయనాన్నీ అన్వేషణనూ రచననూ కొనసాగించారు, ఇప్పుడు తన తెలుగు కధల్ని ఆంగ్లంలోకి అనువదిస్తున్నారు.మదనపల్లి నుంచీ న్యూయార్క్ లో స్థిరపడే ప్రయత్నంలొ వున్నారు.ఈ యాభై కధలే కాక “రెడ్దమ్మగుండు”అనే నవల వ్రాసారు.ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డ్,నూతలపాటి గంగాధరం అవార్డ్ లు అందుకున్నారు.

“తనకు తారసపడిన విశిష్టమైన అనుభవాన్ని చలం తన లేఖల్లో ,మ్యూజింగ్స్ లో పొందుపరచినట్లుగా, వసుంధరాదేవిగారు తన కధల్లో పొందుపరిచారనిపిస్తుంది.భగవంతునితో ప్రమేయం లేని తాత్విక విచారాన్ని ఈమె చాలా కధల్లో మనం గమనించగలం.ఈమె తాత్విక విచారణ ప్రపంచాన్ని వ్యతిరేకించేదికాదు ..అధిగమింపజూసేది...ప్రపంచానుభవాల్తో సంబంధంలేనిది..వాటిమీద ఆధారపడనిది..వాటన్నిటినీ సంతోషంగా తేలిగ్గా తీసుకోనిచ్చేది...దానికోసం ఈమె అన్వేషణ..” అంటారు బండి నారాయణ స్వామి.అవును కదా!!
(భూమిక నుంచి)

No comments: