Tuesday, October 30, 2012

చేత వెన్నముద్ద



                  
పిచ్చుకంత మనిషి..సూర్యోదయానికి ముందే నిద్రలేవాలని ఒక నియమం .సూర్యుడు వచ్చాక ఆయన ఎదుట పళ్ళు తోముకూడదని ఒక నమ్మకం ,ఇంకో నియమం .కాఫీ తాగకముందే శ్రీ సూర్యనారాయణా వేదపారాయణా పాడుకోవాలి.  కాఫీ ఇంగ్లీషు వాళ్లది .అయినా కోడలు వస్తూనే కాఫీ ఇంట్లోకి తెచ్చింది .ఏంచేస్తాం ,,  గ్లాసుడు పాలలో రెండు చుక్కలు డికాక్షన్.  నోటిదగ్గర పెట్టుకోకముందే అబ్బాయి తాగాడా ,అమ్మాయి తాగిందా వాళ్ళకిచ్చావా వీళ్ళకిచ్చావా. పరామర్శ.. అప్పుడు అలమరలోనించీ పెరుగుకుండ తెచ్చి కవ్వం (అదెప్పుడూ గోడకి తగిలించే వుంటుండి తాడుతో సహా) ఆమె ముందు ఎవరైనా పెడితే ఆ కవ్వంలో మూడో వంతు పొడుగుకూడా లేని ఈవిడ మజ్జిగ చిలుకుతుంది .చిలికినంత సేపూ ఏదో పాడుతూనే వుంటుంది .అక్షరాలు రావు.అంకెలు రావు.రూపాయినోట్లు గుర్తు పట్టలేదు.అసలు ఆవిడ జీవితకాలంలో డబ్బు ఇచ్చిపుచ్చుకోడాలతో అవసరమే రాలేదు.ఆవిడ పేరు అనసూయమ్మ.మా నాయనమ్మ...ఆవిడకి గజేంద్ర మోక్షంలో పద్యాలు వచ్చు.రుక్మిణీ కల్యాణం వచ్చు .భాగవతంలో ఎన్నో పద్యాలు అలవోకగా చదివేది.ఎట్లా నేర్చుకుందో తెలీదు . మాకు జ్వరాలొచ్చినప్పుడు దగ్గర కూచుని ఏవేవో శ్లోకాలు చదివేది.  ఖాళీగా కూర్చున్నప్పుడు సాంబశివా సత్యవచనము సాగనివ్వరు లోకులూ, లోకులూ పలుకాకులూ అనే తత్వం ఎప్పుడూ పాడేది ..ఎప్పుడూ ఏదో ఒక పద్యమో తత్వమో పాడుతూనే వుండేది   ఎన్న తత్వాలొచ్చో !!.అంత సాహిత్యం ఆమె బుర్రలోకి ఎట్లా పోయిందో తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా వుంటుంది ఇప్పుడు నాకు !!  కుదురుగా కూచుని పూజలవీ చెయ్యడం ఎప్పుడూ చూడలేదు నేను.ఎపుడూ ఎవరు తిన్నారు ఎవరు తినలేదు ,ఎవరికి వంట్లో బాగాలేదు ,ఆవుకు మేత వేశారా ,గేదెలకి కుడితిపెట్టారా, ఇట్లా అడగడమే అవిడ పూజ.
మా మేనత్త అయిదో తరగతి దాకా చదివింది. భారతం అన్ని పర్వాలూ చదివేసింది.తెలుగు బాగా వచ్చు.భారతంలో ఏపర్వంలో ఏముందో అన్నీ కంఠో పాఠం. మాకు చాలా కథలు అందులోనించే చెప్పేది.  శ్రీనాథుడి చాటువులు సిరిగలవానికి చెల్లున్ లాంటివన్నీవచ్చు ఆవిడకి. నాకు భర్తృహరి పద్యాలు అయిదు నేర్పింది.అందులో ఆరంభింపరు నీచమానవులు ఒకటి గ్రాసము లేక స్రుక్కిన “ “నీరము తప్తలోహమున నిలిచి కొన్ని.ఇప్పటికింకా అప్పచెప్పగలను ఆవిడ మా చేత అలా అప్పజెప్పించుకునేది.

నిన్న వెళ్ళి తల్లీ నిను తలంచి కొనుక్కొచ్చుకుని అపురూపంగా చూసుకుంటున్నప్పుడు నాకు మానాయనమ్మ గుర్తొచ్చింది. నాకు ఆవిడ నేర్పిన మొదటి పద్యం చేతవెన్నముద్దరెండో పద్యం నీవే తల్లివి తండ్రివి ,, పద్యం నేర్పడమే కాదు కుండలో వెన్న పడగానే పిల్లల్ని పిలిచి తలో కాస్త చేతిలో పెట్టి మా అత్తయ్య (మేనత్త)చేతిలో బాగా చివాట్లు తినేది.పడ్ద వెన్నపూసంతా  పిల్లలకి అట్టా పెడితే నెయ్యెక్కడనించీ తెస్తావూ అని దీర్ఘం తీసేదావిడ. మద్దెలో ఇదొక్కతి అని విసుక్కునేదీవిడ.
 మా తాతయ్య అంటే మా అమ్మ తండ్రి, రోజూ రాత్రి భోజనం అయ్యాక ఆరు బయట మంచంమీద పడుకుని కాళహస్తీశ్వర శతకం ,తరంగాలు, తత్వాలూ ఒకటేమిటి ఆయననోటికొచ్చినవన్నీ పాడుతూ వుండేవాడు.  మా పెద్దమ్మ కొడుకు  బి.వి రంగారావు గారు సత్య హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్రకు పెట్టింది పేరు.ఆయన మా యింటి కొచ్చినప్పుడంతా మాయా మేయ జగంబె నిత్యమని..అనే పద్యాన్ని పాడించుకునేవాళ్ళు మా అమ్మా వాళ్ళు.
ప్రయాగకోదండరామ శాస్త్రిగారు మా స్కూల్లో కొంతకాలం పని చేశారు. నేను ఎస్ ఎస్ ఎల్సీ చదివేటప్పుడు.మాస్టారు మా క్లాసులోకి వస్తున్నారంటే ముందు సిగరెట్ వాసనొచ్చేది.అది వారి ఆగమనానికి సంకేతం. ఆయన చక్కగా ఇస్త్రీ చేసిన తెల్లని ధోవతి షర్టు వేసుకుని వచ్చేవారు. మాకు నరకాసుర వధ ,స్వప్నవాసవ దత్త  చెప్పారు.  ఆయన చెప్పిన పరుచూచున్ వరు చూచున్ పద్యం ఇప్పటికీ నేను అప్పజెప్పగలను. పద్మావతీ దేవిని ఉదయనుడు పెళ్ళిచేసుకోబోతూ వుండగా వాసవదత్త ఆవిడకోసం పూలమాల కట్టే దృశ్యం ఇప్పటికీ నా కళ్ళముందే వుంది.  మాకు మొదటిగా శ్రీ శ్రీ అనే ఒక కవి వున్నాడనీ ఆయన మహాప్రస్థానం వ్రాశారనీ చెప్పి ఆయన్ని మా స్కూలుకు తీసుకొచ్చి ఆయన ఉపన్యాసం మాచేత వినిపించిందీ ఆయనే  ఇంత బాగా పాఠం చెప్పే మాస్టారు సిగరెట్ వాసనతొ వస్తే మానీలే అనుకునే వాళ్ళం అప్పుడు.. ఇంత సంపద్వంతమైన నా బాల్యాన్ని మళ్ళీ నా కళ్ళముందుకు తెచ్చింది శివశంకర్ గారి తల్లీ నిన్ను తలంచి..    వెంటనే మరొక ప్రతి కొని  నా పెద్ద చెల్లికి పంపేశాను .చిన్నప్పుడు మేం ఇద్దరం కలిసి బాగా పుస్తకాలు చదివేవాళ్ళం . మా టీనేజి లో ...ఆరుద్ర త్వమేవాహాన్నీ శ్రీ శ్రీ మహాప్రస్తానాన్నీ అందులో ఏంవుందీ తెలీకముందు ఆ కవితా ప్రవాహాన్ని ప్రాసల్ని పదబంధాల్ని పెద్దగా చదివేసి సంతోషపడేవాళ్లం .

Monday, October 29, 2012

మెలకువ

మనిషికి ఉండాల్సిన ' మెలకువ'
ప్రముఖ కథా రచయిత్రిగా పి. సత్యవతి తెలుగు పాఠకులకు, సాహితీప్రియులకు సుపరిచితులు. ఆమె రచించిన ఓ పద్నాలుగు కథలే ఈ 'మెలకువ'. కథలన్నీ చిన్నవే అయినా వాటిల్లోని సారం గొప్పది. చిన్న సంఘటనల వెనుక దాగి ఉండే పెద్ద నిజాలు, సాధారణమైనవిగా వినిపించే సంభాషణల వెనుక పొంచి ఉండే మానవ ప్రవృత్తులూ ఈ కథల్లో దర్శనమిస్తాయి. వీటిల్లో ఎదురయ్యే మనుషుల్లో ఎక్కువ మంది- భూమి నుండి, గ్రామీణ పరిసరాల నుండి దూరమైన మొదటి లేదా రెండో తరం నగర జీవులు. త్వరితగతిన యాంత్రికమూ, సంక్లిష్ట భరితమూ, అమానుషమూ అవుతున్న నగర జీవనపు బాధితులు. అయితే ప్రధాన పాత్రలన్నీ కూడా తమ చుట్టూ పరుచుకున్న వలయాలని ఛేదించి ముందుకి సాగిన స్త్రీలవి. "జీవితం ఒక అనుదిన చర్యగా, స్వయంచరితంగా మారబోయే ప్రమాదఘంటికలు మోగబోయినప్పుడు చప్పున వాటిని సృజనతో ఆపాలి'' అని సత్యవతిగారే స్వయంగా పేర్కొన్నారు. అందుచేత ఈ కథలన్నీ జీవితానికి బాగా దగ్గరగా, విశాలమైన సృజనాత్మక వనంలో సంచరిస్తాయి.

ఆస్తి పంపకాలు వెల్లడించే వాస్తవాలు ('భాగం'), ఏం చేసినా (నోరున్న) ఆడవాళ్ళే చెయ్యాలనే నిజం ('భారవాహిక'), ఇంట్లోని పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాలంటే బయటకుపోయి గౌరవంగా పనిచేసుకోవాలనే స్త్రీల అవగాహన ('కాడి'), మారుతున్న పరిస్థితుల్లో స్త్రీ పురుష సంబంధాల్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ('ఆవిడ'), అర్థవంతమైన జీవితాన్ని, కనీసం అమెరికా ఆశయాన్నయినా సమర్థవంతంగా చేరుకోగల సామర్థ్యం, నైపుణ్యం కల్పించని నేటి చదువులు ('ఒక రాణి - ఒక రాజా')... ఇలాగే మరెన్నో కోణాలు. ఇక తలమానికమైన 'మెలకువ' కథలో- ఎన్నో సంవత్సరాలపాటు సాగిన సహవాసంలో, కాపురంలో ఏర్పడే మాటలకు అందని, మాటలు అక్కర్లేని పరస్పర అవగాహన, సమతుల్యాల్ని సున్నితంగా, హాస్యభరితంగా చిత్రీకరిస్తూనే- 'పల్చని గాజుగోడలు' పొరలుగా ఏర్పడకుండా ఉండాలంటే, జీవితాన్ని ఆస్వాదించాలంటే- నిత్యం మేల్కొని ఉండాలనే గంభీరమైన విజ్ఞతను కలగజేస్తారు రచయిత్రి. మనం అనవసరంగా వాడే కొన్ని ఇంగ్లీషు మాటల్ని చక్కని తెలుగులో ఎలా చెప్పుకోవచ్చో సత్యవతిగారు సూచిస్తారు : 'చెక్క మొహం', 'చదివే కళ్ళజోడు', 'పిలిచే గంట'- ఇలాంటి పద ప్రయోగాల్లో.

చిన్న మాటల్లోనే పెద్ద విషయాలు చెప్పవచ్చనీ, వస్తువే శైలిని నిర్దేశిస్తుందనీ ('ఆత్మలు వాలిన చెట్టు', 'నేనొస్తున్నాను..') జీవితంలో ఏదీ కూడా పైకి కనిపించేటంత సరళంగా ఉండదనీ, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కావాలంటే సంఘర్షణ తప్పదనీ ఈ కథలు మనకు తెలియజేస్తాయి. కథలన్నీ సెలయేరుల్లా గలగలా సాగిపోయినా వాటిల్లో నిశ్శబ్ద గంగానదీ ప్రవాహం లాంటి గాంభీర్యం ఏదో దాగి ఉన్నదనిపిస్తుంది. ఇందుకు కారణం బహుశా తీర్పు చెప్పే ధోరణిలో కాకుండా ఔదార్యం, కారుణ్యభావంతో, మనుషులంటే గౌరవంతో రచయిత్రి ఈ కథల్ని సృష్టించినందువలన కావచ్చు. జీవితాన్ని, తెలుగు భాషని, సాహిత్యాన్ని ప్రేమించేవాళ్ళు మాత్రమే కాక కొత్త గా రాస్తున్న వాళ్ళు, రాయాలని ఉత్సాహపడేవాళ్ళు కూడా సత్యవతిగారి ఈ కథల నుండి చాలా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ముందుమాటలో శివారెడ్డిగారన్నట్టు 'జడప్రాయ యాంత్రిక రచనా విధానాన్నించి రక్షించేది అధ్యయన అన్వయా లే''. ఇవి రెండూ ఈ కథల్లో మెండుగా కనిపిస్తాయి.
- ఉణుదుర్తి సుధాకర్
మెలకువ, పి. సత్యవతి పేజీలు : 120,
వెల : రూ. 60, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు










***

 


ఇష్టంగా ఇస్మత్


  ఒక్కొక్క భాష నుడికారంలో ఒక్కొక్క రకం సౌందర్య పరిమళం వుంటుంది. అనువాదకులు మరొక భాషలో ఎంత నిష్ణాతులైనా ఆ సౌందర్యాన్నీ పరిమళాన్నీ నూటికి నూరు పాళ్ళు పట్టుకోలేరని నేననుకుంటాను. కనీసం డేభ్భై అయిదు శాతం అన్నా తీసుకురావాలని ప్రయత్నించాను.ఈ అనువాదం మూల భాషనుంచీ నేరుగా రాకుండా మధ్య ఒక వాహకం ఉండడం.కూడా కొంత ఇబ్బందికి కారణం అవుతుంది.అయినప్పటికీ ఇస్మత్ చుగ్తాయ్ పాత్రలూ వాటి మనస్తత్వాలూ ప్రవర్తనలూ మనకి కొత్తవి కావు.అవి మన సామాజిక సాంస్కృతిక జీవితంలో ఒక భాగం కనుక చాలా ఆత్మీయ మైనవిగా ,మన బంధువుల వలె అనిపిస్తాయి. తాదాత్మ్యత కలుగుతుంది ముస్లిమ్ స్త్రీలయినా హిందూ స్త్రీలైనా మరొక మతానికి చెందిన వారైనా ఆమె వ్రాసిన కాలానికి ,కొంచెం అటూ ఇటూగా అలాంటి   సమస్యల్నే ఎదుర్కున్నారు.స్త్రీలుగా అవే అనుభూతులని ఆవేదనలని పంచుకున్నారు.ఈ కథాసంకలనం అనువాదానికి పూనుకోకముందు అనేక సంకలనాల్లో వచ్చిన  చుగ్తాయ్ కథలు రెండు,ఒక నవలిక మాత్రమే చదివి ఆమె వ్రాసిన కథల్లో ఈ.రెండే గొప్పవి అనుకున్నాను.ఇలా చాలా మంది అనుకుంటారని ఈ ఆంగ్ల సంకలనానికి ముందుమాట వ్రాసిన తాహిరా నఖ్వి కూడా అన్నారు.ఇందులో వున్న పదహేను కథల్లో అన్నీ కూడా ఆమె శిల్ప చాతుర్యం,తనెక్కడా తొణక కుండా ప్రేక్షక మాత్రంగా కథ చెబుతూ ,ఆ కథని ఎట్లా అర్థం చేసుకోవాలన్నవిషయాన్ని పాఠకుల వివేకానికి వదిలెయ్యడం ఇస్మత్ చుగ్తాయ్ ప్రత్యేకత. అతి విషాదకరమైన గోరీబీ గురించి చెప్పినా రుఖ్సానా గురించి చెప్పినా ఉత్తమ గృహిణిగా మలచబడి ఆకారణంగా నే విడాకులు పొందిన వదినె గురించి చెప్పినా అదే అండర్ టోన్ లో చెప్పడం,కథ నడుస్తూండగా మధ్యలో కల్పించుకుని రచయిత్రి వ్యాఖ్యలు చెయ్యకపోవడం కూడా ఆమె నిబ్బరానికొక మంచి ఉదాహరణ.అర్థ శతాబ్దం క్రిందట ఇంత అవగాహన తో శిల్ప నైపుణ్యం తో వ్రాయడం అబ్బురం.. ముఖ్యంగా లిహాఫ్ కథ ముగింపులోనే ఆమె కథన కౌశలం స్పష్టమౌతుంది. ఒక చిన్నపిల్ల అవగాహన మేరకు ఈ కథ ఎలా ముగియాలో అలాగే ముగిసింది.చెప్ప దలిచిన విషయాన్ని నిస్సంకోచంగా చెప్పడమూ జరిగింది. అంతే కాని తాహిరా నఖ్వి వ్రాసినట్లు ఆమె కు స్వలింగ సంపర్కంపై అవగాహన లేకపోవడం కాదు. స్త్రీల జీవితాలలో వివాహ వ్యవస్థా, సంప్రదాయాలూ ,పిత్రుస్వామ్యమూ కలిసికట్టుగా సృష్టించిన విధ్వంసం ఈ కథలనిండా పరుచుకుని వుంది.అంతా చదివేసి.పుస్తకం పక్కనపెట్టేసి ,హాయిగా వుండడం కుదరదు. బేగమ్ జాన్.కుబ్రా తల్లి ,కుబ్రా,ఆమె చెల్లీ, రుఖ్సానా, హలీమా, గోరీబీ  సరళాబెన్ బిచ్చూ అత్తయ్య ,వదినె.షబ్నమ్  ఇల్లూడ్చే ముసలమ్మ,ఫర్హత్ అంతా చాలాకాలం మన చుట్టూ తిరుగుతూనే వుంటారు. రచయిత్రినీ రచననూ చాలా ఇష్ట పడి చేసిన అనువాదం కనుక చాలా సంతోషాన్నిచ్చింది నాకు.      (పి.  సత్యవతి)

Saturday, May 05, 2012

Down the memory lane









ఎండవేడిమీ విద్యుత్తు కష్టాలూ ,ల్యాప్ టాప్ లో బాటరీ బలహీనమయి త్వరత్వరగా లో బాటరీఅంటూ వుండడం అందరికీ వుండే మామూలు కష్టాలే..కానీ అవి మర్చిపోడానికి నాకు కొన్ని అదనపు అదృష్టాలున్నాయి.అందులో ఒకటి.రోజూ లేవగానే భక్తిగా నమస్కరించాలనిపించే పెద్ద పెద్ద శాఖలతోవుండే చాలా పెద్ద మామిడి చెట్టు. మామిడి చెట్టుడాబా ఆవిడ ,ఎంత ఎండైనా వీధి అరుగు మీద కూచుంటుంది,వాళ్ళాయన  ఆ ఇల్లు కట్టినప్పుడు నాటిన చిన్ని చిన్ని రెండు మామిడి మొక్కలుట ఆ వృక్షం.!!కొడుకులు దాన్ని కొట్టేస్తామంటే తనుపోయాక తప్ప అలాంటి పని చెయ్యొద్దని చెప్పేసింది.పండగలకి వీధందరికీ తోరణాలు ఉగాది పండగ ఉదయానే వీధందరికీ మామిడిపిందెలు సరపరా ఆవిడ కిష్టం.అదలావుంచి ,ఈ మహావృక్షంలో వుండే  పక్షి మిత్రులు  తెల్లవారు ఝామునే ఆర్గుమెంట్లు మొదలుపెట్టి ఇంక నిద్రపోనివ్వవు.అవి అచ్చమైన ఆర్గుమెంటేటివ్ ఇండియన్స్.అప్పుడు లేచి ఒక కాఫీ తాగేసి మేలుకుంటున్న వీధిని తిలకిస్తూ వుండగా వార్తాపత్రక లొస్తాయి. గ్రిల్ లో గుచ్చిన పత్రికలను తీసుకుంటుండగా ఉదయిస్తూన్న  ఉల్లిపూవుఛాయ భానుడు నాకు శుభోదయం చెబుతాడు .పేపర్లు తెచ్చుకుని మళ్ళీ మహావృక్షానికి ఎదురుగా కూచుంటాను.అప్పుడు ఆ మామిడి చెట్టింటి పక్కింటావిడ డాబా మీద కొచ్చి ఇన్ని గింజలేవో పోస్తుంది. పావురాలు (మాఇంటి చుట్టూ పావురాలే కిటికీ అద్దాల మీద నైరూప్య చిత్రాలన్నీ అవి వేసినవే) చిలకలు గోరింకలు ఎన్నెన్ని వస్తాయో చెప్పలేను(.ఈ రెండూ నా మారుతీ నగర్ నివాసానికి కలిగిన అదృష్టాలు). చిలకలు గింజలు తినవని దేవేంద్రాచారి కథలో చదివా కానీ మా మామిడి చెట్టుమీద చిలకలు మాత్రం వస్తాయి.కావాలంటే నా దగ్గర ఫొటో కూడా వుంది.. సరే మరి ఇవ్వాళ నేను అలవాటుగా వార్తాపత్రికలు తీసుకుంటున్నప్పుడు మా సూర్యంగారు మరికాస్త నవ్వుతూ శుభోదయం చెప్పారు. ఏమా అనుకుంటూ పత్రిక విప్పాను. అర్థం అయింది.
ఆ పేపరు నన్ను నా తొలి ఉద్యోగ జీవితంలోకి తీసుకుపోయి ఎన్నో గొప్ప జ్ఞాపకాలు నాముందు పరిచింది.
దాసు కృష్ణమూర్తిగారు నన్ను గురించి హిందూ పత్రిక లో వ్రాసారు.ఇవ్వాళ. అందులో ఆయన నేనెలా తెలుసో చెప్పారు.  ఇక్కడ   ఆయన నన్ను నా తొలి ఉద్యోగపు  గొప్ప అనుభవాల్లోకి అలా మల్లెపూల బుట్టలోకి విసిరేసారు.
విజయవాడ అప్పుడు చిన్నది..ఒక సైకిల్ రిక్షా ఎక్కేసి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మధ్యాహ్న భోజనానికి ఇంటికొచ్చి వెళ్ళచ్చు. కుంపటి మీద కాఫీ పెట్టుకోవచ్చు. వట్టివేళ్ళ తడికలకి నీళ్ళు కొట్టుకుంటూ నామీద నువ్వూ నీమీద నేనూ చల్లుకోవచ్చు.బీసెంటూ రోడ్డుదాకా నడిచి రావచ్చు.రవీంద్రాకూల్ డ్రింక్స్ లో ఫ్రూట్ సలాడ్ తినొచ్చు.నవ్ రంగ్ లో హటారీ ,లాంటి సినిమాల్చూడొచ్చు. లీలామహల్లోనూ చూడొచ్చు. ఐనాక్స్ లే అక్కర్లెదు. తేనె మనసులు సినిమా వచ్చీ రాగానె చూసెయ్యచ్చు. ఇన్ని డబ్బుల్లేవు. ఇంత హడావిడి లేదు. కృష్ణా బరాజ్ దగ్గరికి షికారు పోవచ్చు.ఇన్ని వాహనాల రద్దీ లేదు.అలాంటి రోజుల్లో రెండేళ్ళ నేను ఆంధ్ర ప్రభలో పని చేశాను. అప్పుడక్కడ నేను ఒకే ఒక్క స్త్రీ రత్నాన్ని. అందరికన్న చిన్నదాన్ని. నాకు చదువుకునే రోజుల్నించీ జర్నలిష్టులంటే చాలా ఆరాదన వుంది. నాకప్పుడు ఒక ఉద్యోగం కావాలి. అనుకుంటూ వుండగా ఆంధ్ర ప్రభ వాళ్లకి ట్రెయినీ సబ్ ఎడిటర్లు కావాలన్నారు.ఆడవాళ్ళకి ఇవ్వరన్నారు.ప్రయత్నించు పోయేదేవుందీ అని దీర్ఘాలు తీశారు,అప్పుడు నేను రోజూ ఒక ఆంధ్ర ప్రభ ఒక ఇండియన్ ఎక్స్ ప్రెస్ కొనుక్కుని ఎక్స్ ప్రెస్ లో వాడిన ఏ ఇంగ్లీష్ పదానికి ప్రభలో ఏ తెలుగు పదం వాడారో చాలా సీరియస్ గా అధ్యయనం" చేసి వాళ్ళు పెట్టిన పరీక్షలో సెకండొచ్చేశాను. నాతోపాటు యండమూరి సత్యనారాయణ గారబ్బాయి రామ చంద్రరావు, కొండూరి వీరరాఘవాచారి గారి అబ్బాయి ఆనంద వర్ధన కూడా ఎంపికయ్యారు.అక్కడ మేమే అందరికన్న చిన్నవాళ్ళం అన్నమాట. అక్కడప్పుడెవరున్నరో తెలుసా? రెంటాల గోపాలకృష్ణ గారు,బెల్లంకొండ రామదాసు గారు,అజంతా గారు. అవసరాల సూర్యారావు గారు( ఆయన నేను చేరిన కొత్తలో చనిపోయారు) అల్లాంటి దిగ్గజాలు,సీతారామ బ్రహ్మంగారు,రావూరు సత్యనారాయణగారు. .నేను స్త్రీ రత్నాన్ని కావున నాకు నైట్ డ్యూటీలు వెయ్యవద్దని నన్ను మొఫిసిల్ సెక్షన్ లో  టెన్ టూ ఫైవ్ లో వేసారు.అదంటే అప్పుడక్కడ చిన్నచూపు.ఎందుకంటే టేలిప్రింటర్లో ఇంగ్లిష్లో వచ్చే వార్తలు మేము తెలుగు చెయ్యక్కర్లేదు.అలా చెయ్యడం గొప్ప అని కొందరు భావించేవారు.నన్ను శిక్షణ కోసం సీతారామ బ్రహ్మం గారిదగ్గర వేశారు. మొదటిరోజు ఆయన నన్ను రెండు పదాలు వ్రాసి చూపించమన్నారు.ఒకటి బాధ,రెండు బీభత్సము.రెండూ సరిగ్గా వ్రాసేశాను. ఆయన పరవాలేదే అన్నారు. ఒక నెల తరువాత ఆయన నిన్ను చూస్తే మా అమ్మాయి గుర్తస్తోంది అని చెప్పి రోజూ మధ్యాహ్నం మూడింటికి నాకు కాఫీ తెప్పించి ఇచ్చేవారు.తరువాత ఆయన మద్రాసు వెళ్ళిపోయారు. రెంటాల గారు రామదాసుగారు మాట్లాడే వారు కానీ అజంతా గారు మాత్రం అసలు మాట్లాడేవారు కాదు. ఇంక ఎంతమంది కవులూ రచయితలూ, ఇతర ప్రముఖులు ఆఫీస్ కి వచ్చేవాళ్ళో! అబ్బో! వీళ్లని చూశాను వాళ్లని చూశాను అని ఇంటి దగ్గర గప్పాలు.అప్పుడు లత చాలా వ్రాస్తూ వుండేది.అప్పుడప్పుడు వచ్చేది. వావిలాల గారు పింగళి పరశురామయ్య గారు ఇట్లా ఎంతమందో వచ్చే వాళ్ళు.  అప్పుడు మా సెక్షన్ పక్కనే ఇండియన్ ఎక్స్ ప్రెస్ వుండేది పి ఎస్ రంగస్వామి గారు ఎడిటర్ గా వుండేవారు మాకేమో నీలంరాజు వెంకటశేషయ్య గారు ఈ.అమ్మాయి సిగరెట్లు తాగటానికి బయటికిపోయి కాలక్షేపం చెయ్యకుండా బుద్ధిగా సీట్లోవుండి ఇచ్చిన కాగితమల్లా తీసుకుంటుందని,మెచ్చుకున్నాడాయన పాపం నన్ను!  .అప్పుడు దాసు కృష్ణమూర్తి గారు ,మాధవరావుగారు అంతా ఎక్స్ ప్రెస్ లో  వుండేవాళ్ళు . రెండు ఆఫీసుల్లో ఒకే ఒక్క స్తీ రత్నాన్ని కావున మహా మర్యాద వుండేది. చాలా ఉషారుండేది అక్షరాలు లెక్కబెట్టుకుంటూ డబల్ కాలమ్ ,సింగిల్ కాలమ్  ఎంత ఫాంట్ ,ట్వెంటీ ఫోరా ,ఎయిటీనా !..రాఘవరావుగారిని ఒకాయన వుండేవారు,ఆయన తెల్లగా మల్లెపువ్వులా వుండేవారు.వేటూరి సుందర రామ మూర్తిగారు అసెంభ్లీ రోజుల్లో అక్కడినించీ తెలుగు రిపోర్ట్ ని ఇంగ్లీష్లో వ్రాసి(transcribe) టేలిప్రింటర్ లో పంపేవారు దాన్ని తెలుగులో రాఘవ గారే వ్రాయాలనే వారు.సుందరరామ్మూర్తిగారి భాష ఆయనకే తెలుసుట!ఆయన భారతిలో కథలు వ్రాసారు.నవలలు కూడా వ్రాసారు .రేండేళ్ళ తరువాత నా ఉద్యోగం శాశ్వతం చేయబోయే వేళకి నేను  ఉయ్యాల ఊపడానికి ఇంటికి వెళ్ళిపోయాను. ఇతి ఫస్ట్ ఇన్నింగ్స్.. ఇంత సోది చెప్పేసి అసలు కృష్ణమూర్తి గార్ని గురించి చెప్పకుండా వుంటానా?
కృష్ణమూర్తిగారు చాలా సీనియర్ జర్నలిష్టు.ఇండియన్ ఎక్స్ ప్రెస్ తరువాత ప్రతిష్టాత్మకమైన ఇంగ్లిష్ పత్రికల్లో పని చేశారు.ప్రస్తుతం వాళ్లమ్మాయి తామ్రపర్ణితో న్యూజెర్సీలో వుంటున్నారు .లిటరరీ వాయిసెస్ అనే వెబ్ సైట్ నడిపి చాలా తెలుగు కథలు ఇంగ్లిష్ లోకి అనువాదం చేశారు.వాటన్నిటినీ రూపా అండ్ కో  1947  Santhoshabad passenger అనే సంకలనంగా వేసింది.ఇంకా కొన్ని కథలు చేస్తున్నారు.ఎనిమిది దశాబ్దాల జ్ఞాపకశక్తి,సాహిత్యానురక్తి,ఉత్సాహం ఆయన ఆస్తి.