Wednesday, March 02, 2011

కె.రామలక్ష్మి




తన అభిప్రాయాలను, సూటిగా నిర్మొహమాటంగా,ఒకింత హాస్యం రంగరించి చెబుతూ, జవాబుల శీర్షికతో అనేకమంది పాఠకులను ఆకట్టుకుని, ఎన్నో ఆకతాయి ప్రశ్నలకు మొట్టికాయలు వేసిన సీనియర్ రచయిత్రి రామలక్ష్మి, శతాధికంగా కథలు వ్రాసారు.యాభైయ్యో దశకానికే ఆమె ఇంగ్లిష్ స్వతంత్రలో జర్నలిష్టు గా ఖాసా సుబ్బారావుగారివంటి ప్రఖ్యాత సంపాదకుని వద్ద శిక్షణ పొందారు.అక్కడ పనిచేస్తూ, తెలుగు రచనలకి శ్రీకారం చుట్టడమే కాక అనేక మంది రచయిత మిత్రులతో సాహిత్య చర్చలు చేసే అవకాశాన్ని పొంది తన రచనలకు మెరుగులు దిద్దుకున్నారు. స్వాతంత్ర్యానంతర తొలి తరం యువతిగా ఒక విశిష్టమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోగలిగి ,చదువూ ఉద్యోగం ,జీవన సహచరుణ్ణి స్వయంగా ఎంపిక చేసుకునే స్వేచ్చనూ అందిపుచ్చుకున్నారు ఆరుద్రను జీవన భాగస్వామిని చేసుకున్నారు. . 1954 నాటికే ఆమె తొలి కథా సంపుటి ’విడదీసే రైలుబళ్ళు” ప్రచురించారు.1961 లో ’తొణికినస్వప్నం” ప్రచురిం చారు 2007లో దాదాపు ఎనభై కథల్ని రెండు. సంపుటాలుగా ప్రచురించారు.అలవాటుగానే ఆ యా కథలు ఏ ఏ సంవత్సరాల్లో వచ్చాయో వాటి కింద వెయ్యలేదు.యాభైయ్యో దశకం లో ఆమె వ్రాసిన పార్వతీ కృష్ణమూర్తి కథలు బహుళ పాఠకాదరణ పొందాయి.
స్టువార్టుపురం నేపధ్యంలో “గురు దక్షిణ “అనే నవల కాకుండా ఒకతండ్రికథ మరికొన్ని నవలలు వ్రాశారు.ఇప్పుడు అందుబాటులో వున్నవి ’ఒక జీవికి స్వేచ్చ” “అద్దం”అనే రెండు కథా సంఫుటాలు. త్వరలోనే పార్వతీ కృష్ణమూర్తి కథలు ప్రచురించాలనుకుంటున్నారు.గృహలక్ష్మి స్వర్ణకంకణం,పందిరి మల్లికార్జున రావు వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు.ఆంధ్ర పత్రికలో ప్రశ్నలు జవాబులే కాక ఉదయం వార పత్రిక లో నారీదృక్పధం శీర్షిక ను కూడా సమర్థ వంతంగా నిర్వహించారు.తన భావాలను నిర్మొహమాటంగా నిర్ద్వందంగా చెప్పటం ఆమె ప్రత్యేకత.

1954 లో వచ్చిన విడదీసే రైలు బళ్లు సంపుటిలో చీలిన దారులు అనే కథ వుంది.అందులో ప్రేమించుకున్న యువతీ యువకులు పెళ్లిచేసుకోడానికిష్టపడరు.కారణం పెళ్ళి వలన ఏర్పడే నిరంతర సాన్నిహిత్యం ప్రేమను మాయం చేస్తుందని.అప్పటికే వివాహ వ్యవస్థ పట్ల రామలక్ష్మి గారి అభిప్రాయాన్ని ఈ కథ సూచిస్తుంది.
ఆత్మ గౌరవం స్త్రీలకి గానీ పురుషులకు గానీ ఒకరిచ్చేది ,ఒకరినించీ లాక్కునేదీ కాదు .అది వాళ్లంతట వాళ్ళే అలవర్చుకోవాలనే నమ్మకాన్ని అనేక కథల్లో అర్థం చేయించడానికి ప్రయత్నిస్తారు రామలక్ష్మి.అయితే ఆమె ఎక్కువగా కథలు వ్రాసిన నాటికి అది అందరు స్త్రీలకి సాధ్యమైన విషయం కాదనే నిజాన్ని కూడా చాలా కథల్లో ప్రస్థావించారు.రామలక్ష్మిగారి కథలన్నీ స్త్రీల జీవితాలని ,వాళ్ళు యువతులుగా,గృహిణులుగా ,వృద్ధులుగా ఎదుర్కుంటున్న సమస్యల్ని,చిత్రించినవే. అందుకు ఒక కారణం ఆమె కొన్ని సేవాసంస్థలలో పనిచేస్తూ బాధిత స్త్రీలను సన్నిహితంగా చూడడం కూడా కావచ్చును.మానసిక రోగులను,ఫౌండ్లింగ్ సంస్థలను వికలాంగుల పాఠశాలను సందర్శించడం కూడా కావచ్చు..స్త్రీలపట్ల సహానుభూతి పెంచడానికవి దోహదం చేసి వుండొచ్చు.

రామలక్ష్మి గారి కథలలో పార్వతీ కృష్ణమూర్తి కథలు ఇద్దరు సమ చైతన్య స్థాయి వ్యక్తుల ప్రేమమయమైన సంసార జీవనాన్ని చిత్రించేవి.. అప్పటి వరకూ ఎక్కువమంది వ్రాసిన కథల్లో చూసింది ఒక పురుషుడు భార్య పట్ల చూపే ప్రేమ .ఆమెకి పండక్కి చీరె కొనడం సాయంత్రం మల్లెపూలు తేవడం లేదా ,లేదా కాస్త సానుభూతితో మాట్లాడ్డం.ఆమె అందాన్ని పొగడడం ..దానికి స్త్రీలు ఉబ్బి తబ్బిబ్బైపోవడం..ఇక స్త్రీలు భర్తకీ పిల్లలకీ సేవ చెయ్యడం ఏ కాస్త మెప్పు దొరికినా కృతజ్ఞతా భారంతో కళ్ళు తుడుచుకోడం ..కానీ స్త్రీ తరఫునించీ భర్తని ముద్దు చెయ్యడం అతనితో స్నేహంగా వుండడం కనపడవు.భార్యని తనతో సమానమైన మేధో జీవిగా స్నేహితురాలిలా కాక పేట్రనైజింగ్ గా చూసే భర్తలే సాహిత్యంలో తారసపడతారు.ఇట్లాకూడా వుంటుంది సాహచర్యం అనే కొత్త విషయాన్ని రామలక్ష్మి ఈ కథల ద్వారా ప్రవేశ పెట్టారు.పార్వతిని ప్రొటాగనిష్ట్ చేశారు. కొండొకచో అమాయకురాల్లా కనిపించే పార్వతి చాలా తెలివికలది .సమర్థురాలు.ప్రేమించే హృదయం కలది. చిన్నచిన్న సరదాలూ సంతోషాలూ అలకలూ అసూయలూ వున్న నిండైన మనిషి..విషయ పరిజ్ఞానం కలది..ఆ విషయాన్ని ఒక్కొక్క సారి దాచిపెట్టి కృష్ణమూర్తి పెద్దరికం నిలబెడుతూ కూడా వుంటుంది.పిల్లలకి మంచి స్నేహితురాలు.అల్లరి సహిస్తుంది. తన పిల్లలు తన కళ్ళెదుటే పెద్దవాళ్లవడాన్ని చూస్తూ ఆ ప్రకృతి సహజత్వాన్ని అర్థం చేసుకోగలదు..అయితే పార్వతికి ఆమెను ఆరాధించే సహచరుడూ,డబ్బుకు తడుముకునే పరిస్థితి లేకపోవడం నూకాలు వంటి నమ్మిన బంటూ వున్నారు కదా!!అయినా మనం పార్వతి సృష్టికర్తను మెచ్చుకుని తీరాలి..ఎందుకంటే అన్నీ వున్నా కూడా అట్లా భర్త పక్కన కూచుని అతని ఉంగరాల జుట్టులో వేళ్ళు జొనిపి ఒక్కొక్కసారి ముద్దు పెట్టి సంసారాన్ని ప్రేమమయం చేసుకోగల స్త్రీలు అప్పటికెంతమంది? భర్తలు అట్లా భార్యల్ని ఆరాధించాలని చెప్పిన రచయితలెంతమంది? ఇప్పటికీ అదొక “విష్ ఫుల్ థింకింగ్’గానే వుందికదా చాలామందికి!!

“ఒక జీవికి స్వేచ్ఛ” కథా సంపుటిలో పార్వతీ కృష్ణమూర్తి కథలు ఏడేనిమిది వున్నాయి .అద్దం సంపుటిలో మూడున్నాయి.పార్వతి కూతురు బేబీ కౌమార దశలో తను అందంగాలేనని బాధపడిపోతే తల్లి ఆపిల్లకు ఆత్మ విశ్వాసం కలిగించిన కథ,అట్లాగే బేబీ తన స్నేహితుణ్ని ఇంటికి పిలిచి కాస్త హడావిడి చేస్తే ఆపిల్ల అతన్ని ప్రేమిస్తోందనుకుని తను కృష్ణమూర్తిని మొదటిసారి ఇంటికి పిలిచినప్పుడు పడిన ఆదుర్దా కాలు నిలవక ఇంట్లో తిరిగిన తీరు తలుచుకుంటుంది. అతను రాడు.దాన్ని ఆపిల్ల చాలా కూల్ గా తీసుకోడం పార్వతికి ఆశ్చర్యం కలిగిస్తుంది.. తరానికీ తరానికీ ఆడపిల్లల్లో వచ్చిన వివేకంతో కూడిన మార్పుని ...,ఇప్పటి పిల్లలకి స్నేహం వేరు ప్రేమ వేరూ అనే విషయాన్ని కష్ణమూర్తి చెప్పగా అర్థం చేసుకుంటుంది.పిల్లల సందేహాలను సుతారంగా తీర్చడంలో నేర్పరి( రాలిన తార) ..మొత్తానికి ఇంట్లో అందరికీ ఆమె ఒక చలువ పందిరి..ఇంటి పని చేస్తూ తమని తాము మర్చిపోయిన స్త్రీలను గురించి 80 వ దశకంలో కూడా మనం మాట్లాడుకున్నాం కానీ అప్పటికే పార్వతి తన అభిరుచుల్ని వ్యాపకాలనీ నిలుపుకుంటూనే సంసారాన్ని భారంగా కాక ఒక పాటలా సాగించింది.అందుకు పునాది ఆమె స్వయంగా వేసుకుంది.తన జీవన సహచరుణ్ణి తనే ఎంచుకుంది.పరస్పరం కోరుకున్నాకే అతన్ని జీవితంలోకి ఆహ్వానించింది.(ఏకోన్ముఖులు).యాభైల నాటి తల్లితండ్రుల మనస్తత్వాల రీత్యా ఆడపిల్లలిలా తమ జీవితాలను చక్కదిద్దుకోగలగడం కష్టమే అయినా దిద్దుకోవచ్చు అని చెప్పడం చేస్తాయి ఈ కథలు. ఓల్డ్ రేరిటి కథలో కృష్ణమూర్తి ”ప్రేమకి మించిన ఓల్డ్ రేరిటీ లేదోయ్ పార్వతీ !అది మనం కొనలేం!!కనుక భద్రపరుచుకోవాలి” అంటాడు.
నలభయ్యో పడి, తగ్గు,రాలిన తార మంచి కథలు 80 ల తరువాత ఉధృతంగా వచ్చిన స్త్రీవాద సాహిత్యానికి స్వాతంత్ర్యానంతర తొలి రోజుల్లోనే బీజాలుపడ్దం అప్పటి రచయిత్రుల కథల్లో చూస్తాం ఉదాహరణకి రామలక్ష్మి గారి పేపర్ టైగర్స్ కథలో సుందరి ,మూర్తి ని ప్రేమించింది .అతను పెళ్ళి చేసుకుంటానంటే నమ్మింది..అతను వేరే పెళ్లికి సిద్ధపడి ఆమెకి చెప్పకుండా వెళ్ళిపోయాడు అప్పటికే ఆమె గర్భవతి.. సుందరి అన్న ఆమెను నిలదీసి ,నానా మాటలని ,ఇంక ఉద్యోగం మానేసి ఇంట్లో వుండమంటాడు .సుందరి తిరగబడింది.ఉద్యోగం మాననంది పిల్లని కని పెంచుకుంటానంది. తల్లి తండ్రులని కూడా తనే చూసుకుంటానంది.ఈ కథ ముగింపులో రచయిత్రి “ఆ రోజు ఆ ఇంట్లో విస్తళ్ళు లేవలేదు. నిజమే..కానీ అలా శాశ్వతంగా వుండిపోదుకదా!!” అంటారు.శివారెడ్డి అన్నట్లు తెరిపిలేని దేదీ లేదు.అంతం కానిదేదీ లేదు.ఎవర్ని వారు పునః ప్రతిష్ఠించుకోడం వుంటుంది.సంప్రదాయాలు, ఆధిపత్యాలు మారితీరతాయి తప్పదు..

రామలక్ష్మి చాలా కథల్లో పిల్లల నిరాదరణకి బలైన తల్లి తండ్రులు ,ముఖ్యంగా తల్లులు కనిపిస్తారు.” అదెక్కడ” అనే కథలో పద్మావతి కుటుంబ సభ్యులందరి దృష్టి లో కేవలం “అది”కింద దిగిపోయింది.ఆమె లేనిదే ఆ ఇల్లు నడవదు.ఉద్యోగం చేసే కోడలూ కొడుక్కు స్కూల్ కి వెళ్ళె మనవలకు.రిటైరై ఇంట్లో వుండే భర్తకు.అందరికీ ఆమె జీతం లేని సేవకురాలు.కోడలి మెప్పుకోసం భార్యని సతాయించే భర్త,కోడలికి ఎప్పుడూ వత్తాసు పలికే కొడుకు..ఆమెకి విసుగొచ్చేసి ఇల్లువదిలి పోయి పనిచేసుకు బ్రతికే స్వతంత్రులైన స్త్రీలతో చేరిపోయింది.అక్కడ తనకొక పేరుంది.కొంత జీతముంది..తనకొక బ్రతుకుంది..అదెక్కడ అని వాళ్లు తరువాత ఏడవనీ..”టిపికల్ సన్” కథలో వృద్ధాశ్రమంలో చేరిన మిసెస్ జకరియా చివరి క్షణాల్లో కొడుకుని చూడాలని తపించినా అదంతా నాటకమని కొట్తిపారేస్తాడు కొడుకు. ఆమె పోయాక కట్టిన డిపాజిట్ లెక్కలు త్వరగా తేల్చమంటాడు.

“ఒక జీవికి స్వేఛ్చ” కథలో కొడుకులు తండ్రికి తద్దినం పెట్టడానికి బాధపడిపోవడమే కాక తల్లి ని దగ్గర పెట్టుకోడానికి కూడా వచ్చందాలు పడి చివరికి వితంతువైన అక్క దగ్గర వుంచుతారు.డబ్బు పంపితే ఉంచుకుంటా అంటుంది...భర్తకు తద్దినాలు పెట్తక పోవడానికి చాలా కలత పడి తమ పురోహితుదైన శాస్త్రి చేత ఆయనకు గయలో పిండం పెట్టించి తృప్తిగా కళ్ళుమూసిందావిడ.శాస్త్రిగారు ఆవిడకైనా పిండం పెట్తమని కొడుకుల్ని మందలిస్తారు.”అద్దం’కథలొ లక్ష్మికి అద్దంలో తనని చూసుకోవాలని కోరిక .కానీ ఆ అద్దం ఎన్ని సార్లు చూసుకున్నా తన ముఖం కనపడదు. గతమంతా జ్ఞాపకముందికానీ అద్దంలో ముఖమే కనిపించడంలేదు. అంటె తన ఉనికి ,తన వ్యక్తిత్వం కనపడకుండా పోయిన వైనం..ఒకరోజు అద్దం పగిలింది.అప్పుడా పగిలిన ముక్కల్లో ఆమె ముఖం కనపడింది.ఆమె వుండడం వల్ల ఆమెకొచ్చే కుటుంబ పెన్షన్ కొడుక్కి లాభం...రాగానే తీసేసుకుంటాడు.అద్దంలో తన ముఖం కనపడంగానే ఆమె చనిపోయింది ఆమె పోవడం ఆమెకి లాభం కొడుక్కి పెన్షన్ నష్టం..కుటుంబ పెన్షనున్న తల్లుల్ని ఏదో ఒకరకంగా భరించవచ్చు. అదికూడా లేనివాళ్లకి కష్టమే! అలాగే తన అన్నతమ్ములు తల్లిని సరిగ్గా చూడకపోతే తనే ఆమెను చూడ్డానికి ముందుకొచ్చిన కూతురు కథ “రా అమ్మా రా” తనకన్న ఎక్కువ హోదా లో వున్న భార్యని భరించడం భర్తలకి ఇప్పుడీ ఇరవైయొకటో శతాబ్దంలో కూడా కష్టమే..ఆత్మ న్యూనతతో అతను చేసే అవమానాన్ని కన్నీళ్ళలా మింగి సహించడమే..అంటుంది వర్కింగ్ వైఫ్ కథ. ఇట్లా స్త్రీల ఆర్థిక స్వాతంత్ర్యం సామాజిక హోదా భర్తల ఆత్మన్యూనతను పెంచడమే కానీ తగ్గించడంలేదని చెప్పే కథ.

“నో నో ప్లీజ్” కథ కనిపడెసే అనాథ శిశువుల గురించిన కథ.”హావ్ సెక్స్ బట్ నాట్ అ బేబీ” అంటాడు అట్లా పారేయబడి ఒక మంచి వ్యక్తిచేత పెంచబడి డాక్టర్ అయిన కుర్రవాడు ఒక పోస్ట్ మార్టెమ్ చేసొచ్చి.,తన పెంపుడు తల్లి స్నేహితులైన స్త్రీ వాదులతో కలిసి పిక్నిక్ కి వెడుతూ. ఆసందర్భంగా కొంత స్త్రీవాద చర్చ నడుస్తుంది ;ఈ కథ గురించి చాగంటి తులసి ఇలా అంటారు” “ఆడవాళ్ళ్కో నీతి మగవాళ్ళకో నీతి అని మడి కట్టుకు కూచో నక్కరలెదు “హావ్ ఇట్ “అని చెప్పించారు.అయితే ఎంతగానో చైతన్య వంతురాలైన నిజమైన స్త్రీ వాది తనకి పిల్లలు కావాలనుకుంటే ఆ బాధ్యతను ఎరిగే పిల్లని కంతుంది.అంత చైతన్యవంతుదైన మగవాడినే సహచరుడిగానూ పెళ్ళి చేసుకోకపోయినా సంతానానికి తండ్రిగానూ అంగీకరిస్తుంది. కానీ అక్రమ సంతానంగా పారెయ్యడానికి కంటుందా? ఆవిడకి కడుపు దించుకోవలసిన అవసరం ఏముంది? ఇది ఆలోచించాల్సిన విషయం. పోతే ఆడదానికైనా మగవాడికైనా విశ్రుంఖల సెక్స్ స్వేఛ్చకు అనుమతి ఆమోదయోగ్యమూ భావ్యమూనా?అక్రమ సంతానాన్నిఅందిస్తోదంటే సమాజపు కట్టుబాట్లకు భయపడుతోందనే కదా తాత్పర్యం?కనిపారెయ్యడం,కడుపు దించుకోడం ఐదు నెలల పిండంతో సహా ఆత్మహత్య చేసుకోడం ,సమాజపు కట్టుబాట్లకు భయపడే కదా?సమాజపు అవక తవకలను ప్రశ్నించే చైతన్యవంతులైన మహిళలు ఈ పనులు చెయ్యమని చెప్పరు.......హావ్ సెక్స్ బట్ నాట్ అ బేబీ అనేది పరిష్కారం కాజాలదు”
ప్రేమించిన వాడు వేరే పెళ్లి చేసుకోడానికి వెళ్ళిపోతే తన కడుపులో పిల్లని పెంచుకుంటానని ధైర్యంగా చెప్పిన పిల్ల (పేపర్ టైగర్స్)కథ యాభైల్లోనే వ్రాసారు రామలక్ష్మి.

స్నేహితురాలు లాయర్ శాంత చెప్పినట్లుగా కొన్ని న్యాయ సంబంధమైన కథలు కూడా వ్రాసారు.పిల్లల్ని తండ్రి కష్టడీ లో వుంచాలనే తీర్పు వలన దుర్మార్గులైన భర్తలతోనే దినదిన గండమైన కాపరాలలో చిక్కుపడి వుండే స్త్రీల గురించి చెబుతూ చట్టాలు ఒక్కొక్కసారి స్త్రీలకు వ్యతిరేకంగా ఎలా వుంటాయో “”ఓడిపోయాను” కథలో చెప్పారు “80 వ దశకానికి రెండు మూదు తరాల చదువుకున్న తల్లు లొచ్చారు.వీరు ఆడదాని ఎదుగుదలని మొగ్గలో తుంచేయ్యడాన్ని సహించలేకుండా వున్నారు.ఇలా తుంచివెయ్యడాన్ని క్రిమినల్ తత్వంగా భావిస్తున్నారు . అన్నిరంగాల్లో సమానత్వం అవకాశాలు సాధింఛడానికి , అన్యాయాలను సమస్యలను కోర్టుకీడ్చి న్యాయం పొందవచ్చుననుకుంటే,కోర్టు కెడితే అసలు సమస్య జటిలమై అడుక్కి పోయి మరుగున పడిపోతుంది .న్యాయ స్థానాలు సెక్సువల్ పాలిటిక్స్ కి,మనుధర్మ శాస్త్రానికీ ,మతపరమైన ఆటంకాలకీ అతతంగా వున్నప్పుడె సాంఘిక న్యాయం చేకూరుతుంది ఆస్థితి మనకు లేదు”అంటారు రామలక్ష్మి ఒకచోట.అధికారంలోకి వచ్చిన స్త్రీలు ఆ పార్టి సూచించిన చిలక పలుకులు పలుకుతూ వ్యక్తిగతంగా దిగజారుతున్నారనీ దీనికి విరుద్ధంగా పోరాడాలనీ అంటారు ఇంకొక చోట.స్త్రీలు మేము మానవులం, వ్యక్తులం అని గట్టిగా నోరు తెరవనంతకాలం సంఘ సంస్కరణలు కాగితాలకే పరిమిత మౌతాయంటారు.మార్పు స్త్రీల నించే రావాలి..

రామలక్ష్మి గారి కథల్లో ఎక్కువ స్త్రీలు అప్పటికీ ఇప్పటికీ అనుభవిస్తున్న పరాధీనత అసహాయత ఎక్కవగా కనిపిస్తుంది. అట్లా అని ఆమె కథల్లో స్వతంత్ర వ్యక్తిత్వంతో జీవితం గడుపుతున్న స్త్రీలు లేరని కాదు.ఈ కథల్లో ఒక నలుగురు స్నేహితులు కనిపిస్తూ వుంటారు.వాళ్ళు పెళ్ళై సంసారం చేస్తున్నవాళ్లు.అయితే వాళ్ళు తమ స్నేహాన్నీ ఏళ్ళకొద్దీ కాపాడుకుంటారు.తరుచూ కలుస్తారు.కలిసి ప్రదేశాలు చూడ్డానికి వెడతారు.వాళ్ల స్వంత స్పేస్ ని హాయిగా వినియోగించుకుంటారు. ఇప్పటికీ చాలామందికి అటువంటి స్పేస్ లేదని వాపోయే పరిస్థితి వుంది. యాభై అరవైల నాటికే ఆ పరిస్థితి వుందని చెబుతాయి ఈ కథలు.

“జీవితాన్ని వెనక్కి తిగి చూసి తప్పులు దిద్ది తిరగరాయలేం కదా?అందుకే ముందుకే చూడ్దం అలవాటు చేసుకున్నా ఇప్పటిదాకా సాగి వచ్చినంత దూరం-సాగవలసి వుండదుకదా? ఆవిషయం నాకెప్పుడూ సంతోషమే కలిగిస్తుంది”అది ఆమె ప్రాపంచిక దృష్టి,..తరగని జీవనోత్సాహం, సెన్స్ ఆఫ్ హ్యూమర్.స్నేహించే గుణం ఆమెలో ఆకర్షణలు..

Thursday, February 24, 2011

ముళ్ళపూడి

రావిశాస్త్రి,ముళ్లపూడి వెంకట రమణ ,కొడవటిగంటి, రంగనాయకమ్మలను చదువుతూ సాహిత్యవనంలోకి ప్రవేశించిన రోజులుమాకు అవి.గిరీశం లెక్చర్లు రాజకీయ భేతాళకథలు..అప్పుచేసే నేర్పుకథల్లో కన్నీటిని పన్నీటితో కలిపి పాఠకులను నవ్వుతూ కళ్ళుతుడుచుకునేలా చేసే అద్భుత కథకుడు వెంకటరమణ.బుడుగు రూపంలో ఎన్నెన్ని తరాల పిల్లల్లో ఆయన కనిపిస్తూనే వుంటాడు.మళ్ళీ ఒకసారి ఆ రచనల్ని కొత్త తరం పాఠకులకి పరిచయం చెయ్యడమే ఆయనకి నివాళి.

Friday, February 11, 2011

ఎవరో చెప్పుకోండి

Posted by Picasa

ఈ చిత్రాన్ని జానకీ రాణి గారి దగ్గర్నించీ కాపీ కొట్టాను ఆవిడ నన్ను తిట్టరనే ధీమాతో

Wednesday, February 02, 2011

పి.సరళాదేవి

పంథొమ్మిదివందల యాభై అరవై దశకాలలో ఖాసా సుబ్బారావుగారు సంపాదకులుగా వున్న తెలుగు స్వతంత్ర,,ఆ పైన గోరాశాస్త్రి,శ్రీదేవి గార్ల సంపాదకత్వంలో నడిచి తరువాత ఆగిపోయిన స్వతంత్ర కొత్త రచయితలకి ఆత్మీయ స్వాగతం పలికేవి. రచయిత పేరు ప్రఖ్యాతులని బట్టి కాక రచనని పట్టి ప్రచురించి ఎందరో రచయితల్ని ప్రోత్సహించిన పత్రికలవి ..తన తొలికథలతోనే పాఠకులను ఆకట్టుకున్న రచయిత్రి సరళాదేవి చాలా కథలు స్వతంత్రలోనే వ్రాసారు.శ్రీదేవి కాలాతీత వ్యక్తులు నవల మీద ఒక ప్రశస్తి వ్యాసం కూడా వ్రాసారు.ఆమె తొలి కథబావ చూపిన బ్రతుకు బాట డిసెంబర్ 1955 లో ప్రజాతంత్ర లో ప్రచురితమైంది. మొదటి కథా సంకలనం కుంకుమ రేఖలు అర వై రెండులో వచ్చినా ఆమె 1956 నించీ స్వతంత్రలో దాదాపు ఏడెనిమిది కథలు వ్రాశారు.అవి కుంకుమ రేఖలు సంకలనంలో చేర్చలేదు .కుంకుమరేఖలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ధారావాహికంగా ప్రసారం చేసింది. ఆమె కథనం, భాష ఆమె పేరుకి తగ్గట్టు అంత సరళంగానూ వుంటాయి.. అప్పుడు విజయవాడ కేంద్రంలో అనౌన్సర్ గా పనిచేసిన శ్యామసుందరిగారి కంఠం అత్యంత మధురమైనదీ, ఆమె మోడ్యులేషన్ అనితర సాధ్యమైనదీ కావడాన .సరళాదేవి కథకి ఆమె కంఠం జత జేరి ఆ ధారావాహికకు విశేషాదరణ లభించింది. ... కుంకుమ రేఖలు కథా సంకలనం రెండవ ముద్రణ పైన ముఖచిత్రం , కథా రచనలోనూ వ్యక్తిగతంగానూ ఆమెలో వచ్చిన ప్రౌఢతా, పరిణతి లకు అద్దంలా వుంటుంది. 1955 లో కథారచన ప్రాంభించిన సరళాదేవి అరవై,డెభై దశకాల లో ఎక్కువ వ్రాసారు. 77 లో రెండవ కథా సంకలనం సరళాదేవి కథలు ప్రచురితమైంది..79 లో యువ మాసపత్రికలో కొమ్మా బొమ్మా అనే నవలిక వ్రాశారు..అముద్రితమైన మరో నవలిక చిగురు తో కలిపి 2004 లో పుస్తకంగా తెచ్చారు.తెలుగు సామెతలు సాంఘిక చిత్రణ అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని 1986 లో ప్రచురించారు .స్వతంత్రలో నూ మరికొన్ని పత్రికల్లోనూ కవితలు వ్రాసారు.కొందరు రచయిత్రులతో కలిసి షణ్ముఖప్రియ ,,సప్తపది అనే రెండు గొలుసు నవలలు కూడా వ్రాశారు.

గోరా శాస్త్రిగారి ముందుమాట తో ప్రచురితమైన కుంకుమరేఖలుసంకలనంలో ఎనిమిది కథలున్నాయి. సరళాదేవి కథలు సంకలనంలో పది కథలున్నాయి..కుంకుమరేఖలు లో హేమలత అనే అమ్మాయి అమాయకత్వంనించీ ముక్కు సూటితనం నించీ ప్రపంచపు పోకడలను అర్థంచేసుకుంటూ నొప్పింపక తానొవ్వక బ్రతకడం నేర్చుకున్న వైనం సహజంగా సరదాగా సాగేకథ.పుట్టింటి ఆర్థిక పరిస్థితులనూ అక్కడ డబ్బుతో వాళ్ళు వ్యవహరించే పద్ధతినీ గమనిస్తూ పెరిగిన హేమలత తనకంటూ ఒక కుటుంబం ఏర్పడ్డాక డబ్బుతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనీ పొదుపుచెయ్యాలనీ అట్లా పొదుపుచేస్తే అవసరపడ్డప్పుడు అప్పు చెసేపని వుండదనీ అనుకుంటూ ఆ రోజుకోసం ఎదురుచూస్తుంది.ఆమె భర్త కూడా తన సాదరు ఖర్చులకుంచుకుని తక్కిన జీతమంతా ఆమెకే ఇచ్చి ఇల్లు నడపమంటె సంతోషపడుతుంది.కానీ తక్కువ జీతాల సంసారాల్లో పొదుపు చెయ్యడం మిగల్చడం అంటే అప్పుచెయ్యకుండ వుండగలగడమే నని అర్థం చేసుకుని అటువైపునించీ దృష్టి మళ్ళించి ,తన ముక్కు సూటి స్వభావంతో చిక్కులు కొని తెచ్చుకుని ,అందరితో కలసి పోవాలంటే కొంత లౌక్యం,నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరిగే స్వభావం అవసరమని గుర్తించి..భర్త చేత ఫరవాలేదు హేమలత బ్రతకడం నేర్చుకుంది అనిపించుకుంటుంది. హేమలతకు ప్రయివేటుగా బి.ఎ చదవాలని వుంటుంది.పుస్తకాలు చదివే అలవాటు వుంటుంది.వాటిని జాగ్రత్త పెట్టుకునే అలవాటుకూడా వుంటుంది..పార్ధసారధి ఆమెను అర్ధం చేసుకున్న భర్త.అందువలన ఆమెకు జండర్ పరమైన ఇబ్బందులేమీ లేవు. సరళాదేవి ప్రచురించిన రెండు సంపుటులలోని పద్ధెనిమిది కథల్లొ దాదాపు అన్నీ స్త్రీల జీవితాలు,ముఖ్యంగా.ఆనాటి దిగువ మధ్య తరగతి స్త్రీల జీవితాల చుట్టూ అల్లుకున్నవే..డబ్బు పొదుపు, లౌక్యంగా మెసలడంతో మొదలుపెట్టిన సరళాదేవి, స్త్రీల లైంగికత,,దాంపత్య సంబంధాలు,సమాజం స్త్రీ పురుషులకు కొన్ని ప్రత్యేక లక్షణాలనూ విధులనూ నిర్ణయించి నందువల్ల ఆ ఇద్దరూ కూడా కోల్పోతున్న జీవన ఆనందాలు మొదలైన అనేక విషయాల్ని తన కథల్లో చర్చకు పెట్టారు..ఆమె వ్రాసిన కాలం అప్పుడప్పుడే స్త్రీలు ఉన్నత విద్యను అందుకుంటున్న కాలం,.మధ్య తరగతిలో అప్పటికింకా ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యడం కుటుంబానికి అప్రతిష్ట అనుకునే కాలం..స్త్రీ జీవన గమ్యం వివాహమే నని ,వాళ్ళకింకా పద్దెనిమిది రాకముందే పెళ్లి చెయ్యడానికి తొందరపడిన కాలం.అయితే ఈ పరిస్థితి అన్ని వర్గాలలోనూ లేదు.సంపన్నులూ ,వివిధ సంస్కరణ ఉద్యమాల వల్ల ప్రభావితమైన వాళ్ల కుటుంబాలలో ఆడపిల్లల చదువు పట్ల కొంత ఆసక్తి కనపరచడం ఆనాటికే వుంది..ఈ ఆసక్తిని సరళాదేవి గారి సరస్వతులను చెయ్యబోతేఅనే కథలోచూడవచ్చు అపురూపంగా పెంచుకున్న చెల్లెల్ని డాక్టర్ని చెయ్యాలని లేదా ఒక డాక్టర్ కిచ్చి పెళ్ళి చెయ్యాలని ఆశపడ్డ అన్నగార్ని నిరాశలో ముంచి ఒక సాధారణ ఉద్యోగిని ప్రేమ పెళ్లి చేసుకుంది అతని చెల్లెలు.పోనీ ఆచెల్లెలు కూతుర్నైయినా బాగా చదివిద్దామంటే ఆపిల్ల కూడా అంతే చేసింది..మధ్య తరగతి సంసారాలలో కూతుళ్లకి పురుళ్ళు పోసి పంపడం ఎంత భారమైన విషయమో చెబుతూ కూతుళ్ళెంత బాధ్యతగా ప్రవర్తించాలో కూడా సూచించే మంచికథ కూతుళ్ళు కుటుంబ సభ్యుల పరస్పర ప్రేమల మధ్యనే చిట్టి పొట్టి అసూయలని సహజంగా వర్ణిస్తూ, దంపతుల మధ్య ఎంత సాన్నిహిత్యం వున్నా కొంత స్వంత స్పేస్ కూడా వుండాలని చెప్పిన కథ తిరిగిన మలుపుసరళాదేవి మొదటి సంపుటిలోని కథలకీ రెండవసపుటి లోని కథలకీ స్పష్టమైన పరిణామం వుంది. ఆమెకు జీవితం పట్ల ,స్త్రీ పురుష సంబంధాల పట్ల కల అభిప్రాయాల స్పష్టీకరణ వుంది.రెండవ సంపుటం సరళాదేవి కథలు(1977) లోని పది కథలలోనూ అవి కాక భూమిక ,,నూరేళ్లపంట లలో ప్రచురణ అయిన రెండుకథలలోనూ ఆమెలో జండర్ పరమైన అవగాహన కనిపిస్తుంది.ఒక ఇంటి కథ,వాడి కొమ్ములు భిన్నత్వంలో ఏకత్వం పేచీ” “మర్రి చెట్టినీడలోఅనే కథలు సరళాదేవి జీవన తాత్వికతను ప్రాపంచిక దృక్పథాన్ని తెలిపే కథలు.ఒక ఇంటి కథలో ఒక ఇల్లాలు షట్కర్మయుక్త. ను పాటిస్తూ సంసారం నెగ్గుకొచ్చి తనకూతురికి కూడా అట్లావుండడం స్త్రీ ధర్మమని చెప్పినప్పుడు ,ఆ కూతురు అశ్చర్యపడి ఒక మనిషికి ఇంకొక మనిషి ఇంత భారమా అమ్మా? అని అడుగుతుంది.తనతల్లి ఆషట్కర్మల భారాన్ని మోసింది కానీ తనవల్లయితే కాదనే ఉద్దేశంతో..ఆడపిల్లల ఆలోచనల్లో వచ్చే మార్పుల్ని ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించుకుంటున్న క్రమాన్నీ ఈ కథ అర్థం చేయిస్తుంది..స్త్రీ అనే కథలో పేదరికం కారణంగా శాంతను చెవిటివాడైన గోవిందుకిచ్చి చేస్తారు..చెవిటివాడూ చదువులేనివాడూ అయిన గోవిందుతో ఉంటూనే తమతో శారీరక వాంఛలు తీర్చుకోమని బంధువులే ఆమెకు సంకేతాలివ్వడమే కాక ప్రత్యక్షంగా అడుగుతారు.శాంత తన పరిస్థితిని అర్థం చేసుకుని, చెవిటితనం కాపురం చెయ్యడానికి అడ్డురాదని ,గోవిందు సైకిల్ షాపుకి తోడు తనూ మిషన్ కుట్టి సంపాదించి ఇద్దరు బిడ్దలకి తల్లై వాళ్ళ జీవితాలను దిద్దుతుంది.కానీ ఆమె కొడుకు ధనవంతుల బిడ్దను చేసుకుని వెళ్ళిపోయినప్పుడు తను చనిపోయినట్లే బాధపడుతుంది.పెద్దల నిర్ణయాలకు బద్దురాలై తనకు వాళ్ళు నిర్ణయించిన భవిష్యత్తుని మౌనంగా అంగీకరించి తనున్న చోటునే నివాసయోగ్యంగా మార్చుకున్న స్త్రీ శాంత.

స్త్రీ పురుష సంబంధాలను గురించి సరళాదేవి గారి అభిప్రాయాలకు అద్దం లాంటి కథ వాడికొమ్ములు సాథారణంగా పూర్వపు అత్తగార్లు కోడళ్ళపై కొడుకులు చూపే ప్రేమకు ఒకింత ఈసు చెంది ముందొచ్చిన చెవులకంటె వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటూండేవారు.ఈ కథలో యువకుడు అవును నిజం అవి వాడివేఅని తర్కం చెబుతాడు..అతనిలా అంటాడుమగవాడి జీవితంలో తల్లి ఎక్కువా? భార్య ఎక్కువా? అన్న సమస్య ,బహుశా భారత దేశంలోనే వుండి వుంటుంది..ఆడదాని జీవితంలోకి మొగుడు కావాలా,కొడుకు కావాలా అన్న ప్రశ్నను పంపించి ,అనేక సినిమాల్లోనూ పుస్తకాలలోనూ ఆడది మొగుణ్ణే ఎంచుకోడం చూపించి అదే ఆదర్శ మహిళత్వమని చాటారు..అదిచూసి మనందరం చప్పట్లు కొట్టాము.అదే రకంగా పురుషుడు భార్యే ఎక్కువని ఎంచుకుంటే తప్పట్లు కొట్టరెందుచేత?అతనింకా ఇలా అంటాడు, స్నేహ సంబంధమైన దాంపత్య బంధం నువ్వు వూహించగలవా,మామయ్యా?నాకు తెలుసు నువ్వు ఊహించలేవు.అందులో ఒకరు ఎక్కువా ఒకరు తక్కువా లేదు ఉల్టా సీదాలు లేవు.గృహమే స్వర్గసీమ అన్నట్లు వుండాలని నా కోరిక.. వెనకొచ్చిన కొమ్ములు తప్పకుండా వాడివే మామయ్యా! నువ్వూ నేనూ ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా అవి వాడివేఅంటాడు.తల్లి తండ్రుల పట్ల బాధ్యతలు మరువకుండానే వాళ్ళ అత్యాశలను పక్కనపెట్టి,జీవనభాగస్వామిని ప్రేమించి గౌరవించి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని అంటాడు

భిన్నత్వంలో ఏకత్వం భర్తల చేతులో హీనమైన పరాభవాలకు గురౌతూ కూడా వారిని విడిచిపెట్టని ఇద్దరు స్త్రీల కథ.ఒక స్త్రీ పల్లేటూరిది .చదువురానిది..రెండవ ఆమెకు ఎవరూ కల్పించనవసరం లేనన్ని అవకాశాలు వున్నాయి .కానీ ఈమే భర్తకు విడాకులివ్వదు. ఈ కథకు సరళాదేవిగారి ముగింపు వాక్యాలు,దుర్మార్గుడైన పురుషుడిని రెచ్చగొట్టే స్త్రీ దుర్మార్గురాలు కాదా?ఈ నిర్ణయంతో వీళ్ళు సాధించదలిచింది ఏమిటి?భయంకరమైన సత్యమేదో కనిపించీ కనిపించనట్టుంది.అదే నిజమైతే వీళ్ల ప్రయాణం ఏ దిక్కుకి?

ఇదే కథలో విద్యావంతురాలైన రెండవ ఆమెతో ఆమె బాబాయి ,స్త్రీ విడాకులివ్వడం మళ్ళీ పెళ్లి చేసుకోడం లోకం హర్షించదేమోకానీ చరిత్ర హర్షిస్తుంది,ఉత్తినే కాలిపోయేకన్న ఒక ఆరోగ్యకరమైన పోరాటంలో నువ్వొక సమిధవై కాలిపోతే.. అంటాడు

పేచీఅనే కథలో కట్నం ఇచ్చి కూతురికి పెళ్లి చెయ్యలేని తండ్రి ,తనకూతురితో కేవలం స్నేహంచేస్తున్న హరికిషన్ అనే అబ్బాయిని సూటిగా నాకూతుర్ని పెళ్ళి చేసుకుంటావా? అని అడక్క ఎవరో పుట్టించినట్టు తనే వాళ్ల మీద పుకార్లు పుట్టించి వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యేలా చేస్తాడు....ఈ పేచీ సంగతి తెలిసిన అల్లుడు భార్యని పుట్టింటి గుమ్మం తొక్కవద్దంటాడు.ఇక్కడ స్త్రీలకి నిర్ణయాధికారాలేమీ లేవు వాళ్ల జీవితాలతో ఆడుకునేది ఇద్దరూ పురుషులే...మర్రిచెట్టు నీడలో అనే కథలో మర్రిచెట్టు నీడలో ఇతర మొక్కలు విస్తరించనట్లు తల్లి అక్క చెళ్ళెళ్ల కు ఒక్కగానొక్క డైన కొడుకు/తమ్ముడు వాళ్ళ అతిప్రేమ అనే పొసెసివ్నెస్ లోపడి కొట్టుకున్నంతకాలం తనకి తన భార్యతో నిజమైన ప్రేమతో కూడిన జీవితం దొరకదని అర్థమై ట్రాన్స్ ఫర్ కి పెట్టుకుంటాడు.

సరళాదేవి రెండు నవలికలు లేదా పెద్ద కథలు కూడా ఇద్దరు స్త్రీ ల జీవితాలలోని సంక్షోబాన్నే చిత్రిస్తాయ. రెండు నవలికలలోని ప్రథాన స్త్రీ పాత్రలు దిగువ మధ్యతరగతి వాళ్ళే .చిగురు అనే నవలిక లో విమలని ,ఆ ఇంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఆమె కన్న చాలా పెద్దవాడూ, మూడో పెళ్ళివాడూ,అయిదుగురు బిడ్డలతండ్రీ అయిన రమాపతికి ఇచ్చి పెళ్ళి చేస్తారు.అతను పెళ్ళి చూపుల్లోనే తానీ పెళ్ళి పిల్లల కోసమే చేసుకుంటున్నానని స్పష్టంగా చెప్పాడు.ఆ మేరకు అతను విమలను ఆ అయిదుగురు పిల్లలమధ్యా కుమ్మరించేసి చేతులు దులిపేసుకున్నాడు.ఆమెకేసి కన్నెత్తి చూడలేదు.రమాపతిది ఒక వింత మనస్తత్వం అతనేం చెప్పాలనుకున్నాడో సూటిగా చెప్పడు.పెద్ద దృశ్యం సృష్టిస్తాడు.దాన్ని అర్థంచేసుకుని ఇంట్లో వాళ్ళు మసలాలి.దాదాపు విమల ఈడువాడే అయిన రమాపతి పెద్దకొడుకు హరి ఒక్కడే ఆ ఇంట్లో ఆమెని అర్థం చేసుకున్నవాడు.అతను రమాపతి పెద్ద భార్య కొడుకు.తక్కినవాళ్ళు రెండవ భార్య పిల్లలు..రెండవ భార్య అతని చిత్త వృత్తులన్నింటినీ భరించి సమర్థంగా కాపురం నడుపుకొచ్చింది..విమల ఒక వంట మనిషి గా పిల్లల్ని చూసుకునే మనిషిగా మిగిలిందనీ స్త్రీలకైనా పురుషులకైనా సహజసిద్ధమైన శరీరక వాంఛలు తీరకపోవడం పెద్ద లోటనీ విమలకు అన్యాయంజరిగిందనీ తెలుసుకుని ఆమె తల్లి ఆ దిగులుతోనే మరణించింది. విమల తల్లి రమణమ్మ బాల వితంతువు.ఆమె పరిస్థితి చూసి రంగారావనే యువకుడు జాలి పడ్దాడు.రమణమ్మ కూడా అతనిపట్ల ఆకర్షితురాలైంది.స్నేహితుల సహాయంతో వేరే ఊర్లో వారికి వివాహం జరిగింది..శారీరక అవసరాలు స్త్రీకి వేరూ పురుషుడికి వేరూ వుండవనీ ప్రకృతి స్త్రీ పురుషులిద్దరిమధ్యా ఒకేరకం ప్రభావం చూపిస్తుందనీ సంప్రదాయం మాత్రమె స్త్రీలకు కళ్ళాలు బిగించిందనీ రమణమ్మ నమ్మకం.(రచయిత్రి నమ్మకం) అందుకే ఆమె తనకూతురికి తామే అన్యాయం చేశామని క్షోభించింది..రమాపతి కొడుకు హరి తండ్రిని సరిగ్గా అంచనా వేయగలిగాడు నాన్నకు ఆంగికంగా ఆడది కావాలి.కానీ దాన్ని సాధించడమెలాగో తెలియదు.సక్రమంగా కట్టుకున్న ఇల్లాలిని ఆదరించడమే తెలియదు.సూటిగా ప్రయత్నింఛడం ,మెల్లిగా స్నేహంచెయ్యడం తీయగా కవ్వించడం హాయిగా ఆకర్షించడం ఆయనకు చేతకాదు :సమాజం ఆనేర్పుని పురుషులలో చంపేసింది.ఆడదాని మీద హక్కులిచ్చి.పెళ్ళిపేరుతో ఎన్నో అవకాశాలిచ్చి:పాతివ్రత్యం పేరుతో ఆడదాన్ని కట్టిపడేసి:పురుషునిలో ఆ నేర్పుని చంపేసింది.పితృస్వామ్య వ్యవస్థ వల్ల లభించిన హక్కు అధికారాలు పురుషులను మానవసహజమైన అనుభూతులకెలా దూరంచేశాయో చెబుతుంది రచయిత్రి హరి మాటల్లో...

కొమ్మా బొమ్మానవలిక లో మంగ ఇంకా స్కూల్లో చదువుతూండగానే తండ్రి ఆమెకు పెళ్ళి నిశ్చయం చేస్తాడు.కానీ పెళ్ళినాటి రాత్రే ఆ భర్త పారిపోతాడు.అందుకు కారణం మంగేనని అత్తవారు యాగీ చేస్తారు.అసలు మొదటిరాత్రంటే ఏమిటో కూడా తెలీని మంగ భర్త ఎందుకు పారిపోయాడో తెలీని మంగ అన్ని అపవాదుల్ని భరించింది.కూతురికి జరిగిన అన్యాయానికి కలత పడి ఆ ఆవేదనతో తల్లి మరణించింది.తండ్రి ఆర్థికంగా చితికి పోయాడు.స్నేహితురాలి తల్లి కమలమ్మ ప్రోత్సాహంతో మళ్ళీ చదివి స్కూల్ టీచర్ గా చేరి చనిపోయిన అక్క పిల్లల బాధ్యతకూడా తీసుకుని తోటి టీచర్ అయిన ఆనందరావుని వివాహం చేసుకోవాలనే ఒక మంచి నిర్ణయం తీసుకున్న సమయంలో పారిపోయిన భర్తనంటూ నాయనమ్మని వెంటపెట్టుకుని ఒక వెంగళప్ప వస్తాడు.ఇరుగూ పొరుగూ పంచాయితీలు పెడతారు.అతన్ని అక్కడే వుండనియ్యమంటారు.స్త్రీధర్మాలు ప్రబోధిస్తారు.ఆడదానికిమగదిక్కు ఎంత అవసరమోనొక్కి వక్కాణిస్తారు. వచ్చినతను అసలో నకిలీయో తెలియదు.అంతకు ముందు అక్కభర్త వచ్చి ఆమెను బలవంతంచెయ్యబోయి .ఆమెప్రతిఘటించగా చూసుకో నిన్నేంచేస్తానో అని బెదిరించిపోయాడు..తన ఇంట్లో తన అరుగు కింద చేరి తన బ్రతుకుని పంచాయతీ చేసే హక్కు వీళ్ళకెవరిచ్చారు?తన జీవితంతన చేతుల్లోనించీ జారిపోయి ఎప్పటికప్పుడు ఎవరి చేతుల్లోనో పడుతోంది..ఈఆడదిఎందరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకాలి.అని ఆవేదన పడింది.చివరికి వచ్చిన వాళ్లు చెప్పకుండా పారిపోవడంతో మంగ ఊపిరి పీల్చుకోగలిగింది..స్త్రీల జీవితాలలో వివాహ వ్యవస్థ ఎంత సంక్షోభాన్ని సృష్టిస్తోందో,చదువుకుని సంపాదిస్తున్న స్త్రీలుకూడా సంప్రదాయాల వలలో ఎట్లా చిక్కుకుపోతున్నారో సరళాదేవి ఈ నవలలో చెప్పారు..చిగురు నవలలో హరి,కొమ్మా బొమ్మా లో ఆనందరావు గోపీ రంగారావు హృదయమున్న పురుషపాత్రలు.రమణమ్మ,కమలమ్మ,రమ ఆలోచన కల స్త్రీలు.

స్త్రీల అంతరంగాన్ని ఎరిగిన సరళాదేవి డెభ్భైల తరువాత వ్రాయడం తగ్గించకపోతే ఎనభైల తరువాత స్త్రీలలో పెరిగిన జెండర్ స్పృహతో ఇంకా మంచి కథలు వ్రాసి వుండేవారు. సరళాదేవి నవలికలకు ముందుమాట వ్రాసిన మృణాళిని అన్నట్లు ఆమె ఇంకా వ్రాయవలసిన రచయిత్రి

రచయిత్రి శీలా సుభద్రాదేవికి అక్క..డాక్టర్ శ్రీదేవి స్నేహితురాలు అయిన సరళాదేవి 1937 లోజన్మించి 2007లో మరణించారు.

(భూమిక జనవరి సంచిక నుంచి)